మంగళవారం, 10 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 జూన్ 2025 (11:52 IST)

ముంబైలో ఘోరం.. రైలు నుంచి జారిపడి 12 మంది మృతి

Trains
దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో ఘోరం జరిగింది. రన్నింగ్ రైలు నుంచి జారిపడి 12 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు ప్రయాణికులు ప్రమాద స్థలిలోనే చనిపోగా, మిగిలినవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్టు అధికారులు తెలిపారు. 
 
ముంబైలో నడిచే సిటీ రైళ్లలో బోగీ కిక్కిరిసిపోవడంతో ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుంచి థానే జిల్లాలోని కసార ప్రాంతానికి వెళుతున్న లోకల్ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఈ ప్రమాదానికి గురయ్యారు. 
 
ప్రయాణికుల రద్దీ, రైలు బోగీ కిక్కిరిసిపోయి ఉండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. తీవ్రమైన రద్దీ వల్ల కొందరు ప్రయాణికులు డోర్ల వద్ద వేలాడుతూ ప్రయాణించారని, ఈ క్రమంలోనే వారు అదుపుతప్పి కిందపడిపోయారని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 
 
క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్య సహాయం అందిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, పరిస్థితులపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.