గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 అక్టోబరు 2019 (14:26 IST)

పైల్స్ చికిత్సకు ఆస్పత్రికి వచ్చిన మహిళ.. మత్తిచ్చి రేప్ చేసిన డాక్టర్

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. పైల్స్ చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ రోగిపై వైద్యుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెకు మత్తిచ్చి మరీ అత్యాచారం చేసి... దాన్ని వీడియో తీశాడు. ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైలోని జోగేశ్వరి ఈస్ట్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ (27) పైల్స్ సమస్యతో బాధపడుతోంది. ఈ క్రమంలో చికిత్స కోసం అదే ప్రాంతంలో ఉన్న డాక్టర్ వంశరాజ్ ద్వివేది క్లినిక్‌కు వచ్చింది. ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి 45 నిమిషాల పాటు నిద్రపోవాలని ద్వివేది సూచించాడు. 
 
ఆ తర్వాత ఆమె మత్తులోకి జారుకుంది. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి, దాన్ని వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోను బాధితురాలికి పంపి, తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ద్వివేది ఒత్తిడి చేయసాగాడు. 
 
ఆమె నిరాకరించినప్పటికీ.. ఆ వైద్యుడు మాత్రం ఆమెను బెదిరించసాగాడు. ఈ క్రమంలో ఆ మహిళ ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. అయినప్పటికీ తనకు పడకసుఖం ఇవ్వాలంటూ బెదిరించాడు. దీంతో ఈ వేధింపులను తట్టుకోలేని ఆమె... జరిగిన విషయాన్ని బంధువులకు, భర్తకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... కామాంధ వైద్యుడుని అరెస్టు చేశారు.