1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 జనవరి 2022 (13:48 IST)

'బికిని గర్ల్' అర్చనా గౌతమ్‌కు టిక్కెట్ ఇచ్చిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ మరోమారు చిక్కుల్లో పడి విమర్శలు ఎదుర్కొంటుంది. బికినీ గర్ల్ అర్చనా గౌతమ్‌కు అసెంబ్లీ టిక్కెట్‌ను కేటాయించింది. ఈమె ప్రముఖ మోడల్ కూడా. గతంలో మిస్ బికినీగా అర్చన గెలుపొందారు. ఆ తర్వాత పలు చిత్రాలు, సీరియళ్ళలో నటించారు. ఆమెకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హస్తినాపూర్‌ నియోజకవర్గంలో అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కేటాయించింది. 
 
దీనిపై పలు హిందూ సంఘాలతో పాటు బీజేపీ, అఖిల భారత హిందూ మహాసభ తీవ్రంగా ఖండించింది. చీఫ్ పబ్లిసిటీ కోసమే బికినీ భామకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కేటాయించిందంటూ మండిపడ్డారు. దీనిపై అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మాట్లాడుతూ, ఎంతో పవిత్రమైన హస్తినాపూర్‌లో అర్చన వంటి వ్యక్తికి టిక్కెట్ ఇచ్చారంటూ మండిపడ్డారు. 
 
ఆమెకు టిక్కెట్ ఇవ్వడం ద్వారా పవిత్ర ప్రాంతంలో నివసించే ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మానసికంగా, నైతికంగా దెబ్బతిన్నదని, ఆ పార్టీ నుంచి ఇంతకంటే ఎక్కువ ఏదీ ఆశించలేమంటూ ఆయన ఎద్దేవా చేశారు. అర్థనగ్నంగా ఉన్న ఫోటోలను పోస్ట్ చేసే అర్చనకు టిక్కెట్ ఇవ్పడం దారుణని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.