1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 మే 2024 (15:41 IST)

జూన్ 4 తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది : కేంజ్రీవాల్

arvind kejriwal
జూన్ నాలుగో తేదీ తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. ఆయన ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇండియా కూటమి జూన్ 4న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. జూన్ 4 తర్వాత బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని ఆయన జోస్యం చెప్పారు. 
 
జూన్ 4వ తేదీన వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని, ఆ తర్వాత ఢిల్లీకి రాష్ట్ర హోదా అందజేస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జూన్ 4న మోడీ ప్రభుత్వం ఏర్పాటుకాబోదని అని అన్నారు. 'జైలు నుంచి విడుదలయ్యాక నేరుగా మీ వద్దకే వచ్చాను. ఢిల్లీ ప్రజలను చాలా మిస్ అయ్యాను. నా కోసం ప్రార్థనలు చేసి ఆశీర్వాదాలు అందించిన కోట్లాది మందికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది. నియంతృత్వానికి వ్యతిరేకంగా నా పోరాటం కొనసాగుతుంది' అని కేజీవాల్ పేర్కొన్నారు.
 
'ఓటర్లు ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలి. ఈ కూటమి దేశం దిశను మార్చుతుంది. దేశం ఎందరో నియంతలను చూసింది. వారి నియంతృత్వం కొనసాగలేదు. ప్రజలు వారిని పడగొట్టారు. నేడు నేను నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. ఈ పోరాటంలో మీ మద్దతు కోరేందుకు వచ్చాను' అని అన్నారు. తీహార్ జైలులో ఉన్న తన కేబినెట్ మాజీ మంత్రులు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్‌ను కేజీవాల్ గుర్తు చేసుకున్నారు. వారు పాఠశాలలు, ఆసుపత్రులు రూపురేఖలను మార్చారని పేర్కొన్నారు.
 
కాగా తీహార్ జైలు నుంచి శుక్రవారం విడుదలైన అరవింద్ కేజ్రివాల్ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతంగా కొనసాగిస్తున్నారు. శనివారం ఆయన చేపట్టిన మొదటి రోడ్ షోకు పెద్ద సంఖ్యలో ఆప్ మద్దతుదారులు హాజరయ్యారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి ఓపెన్ రూఫ్ వాహనంపై కూర్చొని కేజీవాల్ ప్రచారం నిర్వహించారు. దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ర్యాలీని కొనసాగించారు.