శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (09:55 IST)

కోల్‌కతా మెడికో హత్యాచార కేసు : 41 రోజుల తర్వాత ఆందోళన విరమించిన ఆర్జీ కర్ వైద్య విద్యార్థులు

rg kar hospital
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగు గత 41 రోజులుగా ఆందోళన చేసిన ఆర్జీ కర్ వైద్య కాలేజీకి చెందిన విద్యార్థులు ఎట్టకేలకు శాంతించారు. తమ ఆందోళనను విరమించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు ప్రస్తుతం సీబీఐ విచారణ జరుపుతుంది. ఈ ఘటనకు సంబంధించిన బాధితురాలికి న్యాయంతో తమ డిమాండ్ల పరిష్టారం కోసం ఆర్జీ కర్ వైద్య విద్యార్థులు ఆందోళనబటపట్టారు. తమ డిమాండ్ల పరిష్కార అంశంలో వారు ఏమాత్రం మెట్టుదిగకపోవడంతో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఆందోళన చేస్తున్న స్థలానికి స్వయంగా వచ్చి చర్చలు జరిపారు. ఈ క్రమంలో తమ ఆందోళనను విరమించి శనివారం నుంచి విధుల్లో పాల్గొంటామని వారు ప్రకటించారు. 
 
బెంగాల్ ప్రభుత్వంతో రెండు దఫాల చర్చల అనంతరం వైద్య విద్యార్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం మమతా బెనర్జీతో వారి చర్చలు సఫలం కావడంతో విద్యార్థులు నిరసనలను విరమిస్తున్నట్లు ప్రకటించారు. వారి పలు డిమాండ్లకు ముఖ్యమంత్రి అంగీకరించారు. దీనిలో భాగంగా కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌ను తప్పించి ఆయన స్థానంలో మనోజ్ కుమార్ వర్మకు బాధ్యతలు అప్పగించారు.
 
అలాగే మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కౌస్తవ్ నాయక్, హెల్త్ సర్వీస్ డైరెక్టర్ దేవాశిష్ హల్డేర్లను వారి పోస్టుల నుంచి తొలగించడం జరిగింది. ఇక వైద్య విద్యార్థులు రెండో దఫాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో బుధవారం భేటీ అయ్యారు. అనంతరం తమ ఆందోళన విరమణ ప్రకటన చేశారు.
 
'మా నిరసన విరమిస్తున్నాం. ఈ కేసును త్వరగా విచారించాలని కోరుతూ గురువారం మధ్యాహ్నం సీబీఐ ఆఫీస్‌కు ర్యాలీ చేపడుతున్నాం. వరదల కారణంగా ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రోగులకు వైద్య సేవలు అందించడానికి శనివారం నుంచి విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నాం. అత్యవసర సేవల్లో పాల్గొంటాం. అయితే, కోల్‌కతాలోని అన్ని వైద్య కాలేజీల వద్ద ధర్నా మంచాస్ అలాగే కొనసాగుతాయి' అని ఓ డాక్టర్ చెప్పుకొచ్చారు.