1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (09:05 IST)

అనిల్ కుంబ్లేకు ట్రాఫిక్ కష్టాలు.. ఆర్టీసీ బస్సులో ప్రయాణం

anil kumble
భారత క్రికెట్ లెజెండ్ అనిల్ కుంబ్లేకు ట్రాఫిక్ కష్టాలు ఎదురయ్యారు. దీంతో ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్నాటకలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం శక్తి స్కీమ్‌ను ప్రారంభించింది. దీనికి వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలోని ప్రైవేటు రవాణా వాహన యజమానులు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో బెంగుళూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో వాహనాలు నిలిచిపోయాయి. ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరిలో మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కూడా ఒకరు. ఈయన విమానాశ్రయం నుంచి తన ఇంటి వరకూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. తన ఆర్టీసీ బస్సు ప్రయాణానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. 
 
కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి పథకం తమ పొట్టకొడుతోందంటూ ప్రైవేటు రవాణా వాహనాల వారు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ పథకంతో తమ ఆదాయం తగ్గిపోతోందంటూ గగ్గోలు పెట్టారు. ఈ సమస్యకు పరిష్కారంగా శక్తి స్కీమ్‌ను ప్రైవేటు బస్సులకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, నగరంలో బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించాలని కూడా వారు డిమాండ్ చేశారు. నిత్యం బిజీబిజీగా ఉండే బెంగళూరు నగరంలో ప్రజాజీవితం బంద్ నేపథ్యంలో అస్తవ్యస్థమైంది. అయితే, ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించడంతో వారు బంద్‌ను ముగించారు.