1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 జూన్ 2020 (08:49 IST)

ఏం అయితది... పాపతో వచ్చి క్వార్టర్‌లో నా పక్క గదిలో ఉండు...

తెలంగాణా రాష్ట్రంలో ఓ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తన విభాగంలో పనిచేసే ఎక్సైజ్ సీఐను లైంగిక కోర్కె తీర్చాలంటూ వేధించాడు. భర్త, పాప ఉంది సార్ అని చెప్పినప్పటికీ.. భర్త ఉంటే ఏం అయితది... పాపతో వచ్చి క్వార్టర్‌లో నా పక్క గదిలో ఉండు అంటూ సతాయించాడు. ఇలా ప్రతి రోజూ నరకం చూపిస్తుండటంతో ఆమె భూపాలపల్లి జిల్లా కలెక్టర్, వరంగల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనరుకు తన బాధను లిఖిత రూపంలో రాసి షీల్డ్ కవరులో సమర్పించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కాటారం ఎక్సైజ్ సీఐగా ప్రశాంతి పని చేస్తోంది. ఈమె విధుల్లో చేరినప్పటి నుంచి భూపాలపల్లి ఎక్సైజ్‌ సూపరిటెండెంట్‌ మూడేళ్లుగా నిత్యం వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేసింది. 'నా క్వార్టర్‌ పక్కనే నీకు క్వార్టర్‌ ఇప్పిస్తా. ఇక్కడే ఉంటూ డ్యూటీ చేయ్‌. అవసరమైతే భూపాలపల్లి ఇన్‌చార్జి సీఐ పోస్టు కూడా నీకే ఇప్పిస్తా' అంటూ తనపై ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఒత్తిడి తెచ్చారని వాపోయారు. 
 
'నా భర్తకు కూడా ఉద్యోగం ఉంది.. నాకు పాప ఉంది. వాళ్లను వదిలి ఇక్కడెలా ఉంటాను సార్' అని ఆయనకు తాను చెప్పినప్పటికీ.. 'ఏం అయితది.. పాపతో ఇక్కడే ఉండు' అని తనకు ఇబ్బంది కలిగించేలా మాట్లాడారని ఆరోపించారు. రాత్రి వేళల్లో స్వయంగా పాట పాడి దానిని తనకు వాట్సాప్‌లో షేర్ చేసేవారనీ, మొదట్లో ఆయన బుద్ధి తెలియక 'బాగుంది సార్' అంటూ కామెంట్ చేసినట్టు చెప్పుకొచ్చింది. 
 
ఆ తర్వాత నుంచి పనికి మాలిన పాటలను పోస్టు చేస్తూ వెకిలిచేష్టలకు దిగుతున్నారని ఆరోపించారు. సూపరింటెండెంట్‌ మాటలతో మానసికంగా క్షోభ అనుభవిస్తున్నానని, గతంలో ఇక్కడ పని చేసిన మహిళా ఉద్యోగులతోనూ ఆయన ఇలాగే వ్యవహరించేవారని తెలిపారు. ఈ విషయమై బుధవారం రాత్రి కలెక్టర్‌కు సీల్డు కవరులో ఫిర్యాదు చేసింది.