1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 21 మే 2022 (19:38 IST)

అమరావతి ఎంపీకి వీడని కష్టాలు... వారం రోజుల్లో కూల్చివేయాలంటూ...

navneet kaur
మహారాష్ట్రలోని అమరావతి బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు ఇప్పట్లో కష్టాలు వీడేలా కనిపించడం లేదు. ఇప్పటికే హనుమాన్ చాలీసా పఠనంపై చెలరేగిన వివాదంలో అరెస్టు అయిన నవనీత్ కౌర్ దంపతులు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. ఇపుడు మరో కష్టం వచ్చిపడింది. 
 
ముంబై నగర పరిధిలోని ఖర్ ఏరియాలో నవనీత్ కౌర్ ఇంటిలో కొంతభాగం అక్రమంగా నిర్మించారంటూ ముంబై నగర పాలక సంస్థ ఆమెకు నోటీసులు జారీచేసింది. ఈ అక్రమ నిర్మాణాన్ని వారం రోజుల్లో కూల్చివేయాలని లేనిపక్షంలో తామే కూల్చివేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
కాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే హనుమాన్ చాలీసా పఠించాలని డిమాండ్ చేసిన కౌర్‌ అందుకు ఆయన సమ్మతించకపోతే ఆయన ఇంటి ముందు బైఠాయించి హనుమాన్ చాలీసాను పఠిస్తానంటూ హెచ్చరికలు చేశారు. 
 
ఈ క్రమంలో సీఎం ఇంటికి వెళతారన్న అనుమానంతో కౌర్ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆ దంపతులకు పది రోజుల తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ పది రోజుల పాటు వారు జైలు జీవితం గడిపారు.