1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 మార్చి 2023 (15:34 IST)

నాటు బాంబులతో దాడిచేసి.. కత్తులతో నరికి.. బీజేపీ నేత దారుణ హత్య

senthil kumar
పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. మంగళం నియోజకవర్గం కార్యదర్శిగా ఉన్న సెంథిల్ కుమార్ (46).. ఆదివారం రాత్రి ఓ బేకరీ వద్ద నిల్చొనివున్న సమయంలో కొందరు వ్యక్తులు బైకులపై వచ్చి తొలుత నాటు బాంబులతో దాడి చేశారు. ఆ తర్వాత కత్తులతో నరికి చంపి అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
దుండగులు బైకులపై రావడం, నాటు బాంబులతో దాడి చేయడం, మారణాయుధాలతో సెంథిల్ కుమార్‌ను విచక్షణా రహితంగా నరకడం, ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోవడం వంటి దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. 
 
కాగా, సెంథిల్ కుమార్ గత కొంతకాలంగా గంజాయి విక్రయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. దీంతో గంజాయి మాఫియా ముఠానే ఈ దారుణానికి పాల్పడివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అదేసమయంలో బీజేపీ - ఎన్ఆర్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఈ హత్య కేసును సీరియస్‌గా తీసుకుంది. స్థానిక సీఐతో పాటు ఎస్.ఐను కూడా సస్పెండ్ చేసింది. 
 
హంతకులను గుర్తించి, అరెస్టు చేసేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ కేసును వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. పాత కక్షల కారణంగా హత్య చేశారా? లేక మరేదైనా కారణం వల్ల చంపేశారా? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సెంథిల్ కుమార్ నివసించే ప్రాంతంలో భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు.