శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 జనవరి 2021 (15:27 IST)

సెంట్రల్ విస్తాకు సుప్రీంకోర్టు పచ్చజెండా

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్. అంటే.. కొత్త పార్లమెంట్ భవనాల నిర్మాణం. ఈ ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టు డిజైన్‌పై కేంద్రం వాదనలతో జస్టిస్‌ ఎ.ఎం. ఖన్విల్కర్‌ ధర్మాసనం ఏకీభవించింది. 
 
నిర్మాణ పనుల ప్రారంభానికి హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనుమతి తప్పనిసరని మంగళవారం ఇచ్చిన సంచలన తీర్పులో సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. కమిటీ నుంచి ప్రాజెక్టు ప్రపొనెంట్లు తప్పనిసరిగా ఆమోదం పొందాల్సి ఉంటుందని ఆదేశాలిచ్చింది. 
 
ఈ మేరకు న్యాయమూర్తులు ఏఎం ఖాన్‌విల్కర్, దినేశ్ మహేశ్వరి, సంజీవ్ కన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తీర్పు వెలువరించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం గత ఏడాది 5న తీర్పును రిజర్వ్ చేసి మంగళవారం తీర్పును వెలువరించింది.
 
డీడీఏ చట్టం కింద అధికారాల వినియోగం చెల్లుబాటవుతుందని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. అలాగే పర్యావరణ అనుమతి సిఫారసులు సరిగానే ఉన్నందున వాటి చెల్లుబాటును ధ్రువీకరిస్తున్నట్టు స్పష్టం చేసింది.
 
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా, దేశ రాజధాని ఢిల్లీలోని లుట్యెన్స్ జోన్‌లో కేంద్రం సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నిర్మించ తలపెట్టింది. ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ఉన్న ప్రాంతాన్ని ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. 
 
ఇందులో భాగంగా నూతన పార్లమెంట్ భవన నిర్మాణం, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం, ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న 3 కిలోమీటర్ల రాజ్‌పథ్‌ పునరుద్దరణ చేపట్టనున్నారు.