1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 నవంబరు 2021 (09:03 IST)

సుక్మా జిల్లాలో విద్యార్థిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో నక్సల్స్ కిడ్నాప్‌కు పాల్పడ్డారు. ఒక విద్యార్థినితో పాటు మొత్తం ఐదుగురిని అపహరించారు. సుక్మా జిల్లాలోని కొన్టా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బటెర్‌ గ్రామంపై మావోయిస్టులు శనివారం సాయంత్రం దాడి చేశారు. 
 
ఈ సందర్భంగా ఐదుగురు గ్రామస్తులను బలవంతంగా తమవెంట తీసుకెళ్లారు. వారిలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని కూడా ఉండటం గమనార్హం. కాగా, వారిని ఎందుకు తీసుకెళ్లారనే విషయం ఇంకా తెలియలేదని సుక్మా ఎస్పీ సునీల్‌ శర్మ తెలిపారు. వారికోసం పోలీసులు గాలింపు చేపట్టారని వెల్లడించారు.
 
కొన్నిసార్లు సమావేశాల సందర్భంగా మావోయిస్టులు గ్రామస్తులను తీసుకెళ్తుంటారని చెప్పారు. ఎత్తుకెళ్లినవారిని విడుదల చేయాలని బస్తర్‌ రీజియన్‌లోని గిరిజన సంఘాలు మావోయిస్టులను కోరాయన్నారు. గత జూలైలో కుందేడ్‌కు చెందిన ఎనిమిది మందిని ఎత్తుకెళ్లారని, రెండు మూడు రోజుల తర్వాత వారిని విడుదల చేశారని శర్మ గుర్తు చేశారు.