శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (12:59 IST)

కరోనాపై విజయానికి ప్రతి పౌరుడు పాటించాల్సిన సూత్రాలివే...

ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. ఈ వైరస్ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు దేశాలకు దేశాలే లాక్‌డౌన్ ప్రకటిస్తున్నాయి. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. సామాజిక, భౌతిక దూరాన్ని పాటించాలని పదేపదే చెప్తున్నాయి. 
 
అదేసమయంలో ఈ కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏడు సూత్రాలు వెల్లడించారు. ఈ సూత్రాలను ప్రతి పౌరుడూ పాటించి కరోనాపై విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఆ ఏడు సూత్రాలేంటో ఓ సారి తెలుసుకుందాం. 
 
ఏడు సూత్రాలు ఆయన మాటల్లోనే..
 
* మీ ఇంట్లో ఉన్న వృద్ధులను జాగ్రత్తగా చూసుకొండి. ముఖ్యంగా అంతకుముందే ఏదైనా అరోగ్య సమస్య ఉన్న వాళ్ల విషయంలో ఇంకా శ్రద్ధగా ఉండాలి. వాళ్లకి కరోనా సోకకుండా కాపాడుకోవాలి. 
 
* లాక్‌డౌన్, వ్యక్తిగత దూరంకి సంబంధించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. ఇంట్లో తయారు చేసిన మాస్కులను ఉపయోగించండి. 
 
* మీ రోగ నిరోధక శక్తి పెంచుకొనేందుకు ఆరోగ్యశాఖ (ఆయుష్) ఇచ్చిన మార్గదర్శకాలను పాటించండి.
 
* కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అందరు 'అరోగ్య సేతు' యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్లని కూడా డౌన్‌లోడ్ చేసుకోమని సూచించండి.
 
* మీకు సాధ్యమైనంత వరకు.. పేదలకు సహాయం చేయండి. వాళ్ల ఆకలి కష్టాలు తీర్చే ప్రయత్నం చేయండి. 
 
* మీకు పని చేస్తున్న చోట.. మీ తోటి ఉద్యోగుల పట్ల కరుణ, దయ చూపించండి. ఏ కంపెనీ కూడా తమ ఉద్యోగులను విధుల నుంచి తొలగించవద్దు. 
 
* దేశ వ్యాప్తంగా కరోనాపై పోరాటం చేస్తున్న యోధులు డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులను గౌరవించండి.
 
ఈ ఏడు సూత్రలులను ప్రతి ఒక్కరు పాటించాలని తెలిపిన ఆయన.. ఈ సప్తపది విజయాన్ని అందించే మార్గం అని అన్నారు. విజయం సాధించేందుకు మనం నిష్టగా చేయాల్సిన పనులు ఇవి అని పేర్కొన్నారు. లాక్‌డౌన్ ముగిసేవరకూ ప్రభుత్వం విధించిన నిబంధనలకు నిష్టగా పాటించాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు.