శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (20:03 IST)

27న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ మళ్లీ భేటీ!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోమారు వీడియో కాన్పరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా వైరస్ మహమ్మారికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా ఆయన ఈ నెల 27వ తేదీన ఈ సమావేశం నిర్వహించనున్నారు. 
 
ఇందులో లాక్‌డౌన్ అమలుతో సహా కోవిడ్-19 అదుపునకు తీసుకుంటున్న చర్యలు, తాజా పరిస్థితులను ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ సమీక్షిస్తారు. కరోనాపై పోరాటంలో భాగంగా లాక్‌డౌన్ అనంతరం ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడటం ఇది మూడోసారి.
 
మరోవైపు, తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా కరోనా కేసులు 20,471కు చేరుకున్నాయి. వీటిలో 15,859 యాక్టివ్ కేసులు కాగా, 3,958 మందికి పూర్తి స్వస్థత చేకూరి డిశ్చార్చి అయ్యాయి. 652 మరణాలు సంభవించాయి.
 
ఇదిలావుండగా, తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా వైద్యులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందిపై అక్కడక్కడా దాడులు జరుగుతున్నాయి. వీటిపై కేంద్రం సీరియస్ అయింది. 
 
కొవిడ్-19 మహమ్మారిపై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఆరోగ్య సిబ్బంది భద్రతపై రాజీపడే ప్రసక్తే లేదని ప్రధాని మోడీ హెచ్చరించారు. దీనిపై ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటిచెబుతూ కేంద్ర మంత్రివర్గం ఆర్డినెన్స్‌ను ఆమోదించినట్టు ఆయన పేర్కొన్నారు. 
 
కొవిడ్-19 నిరోధక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆరోగ్య సిబ్బందిని వేధించినా, వారిపై దాడులకు పాల్పడినా కఠినంగా శిక్షించాలంటూ బుధవారం కేంద్ర కేబినెట్ ఓ ఆర్డినెన్స్ జారీచేసింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్విటర్లో స్పందిస్తూ.. 'కొవిడ్-19 మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న ప్రతి ఒక్క హెల్త్‌కేర్ వర్కర్‌ కాపాడుకుంటామని చెప్పేందుకు 'అంటు వ్యాధుల (సవరణ) ఆర్డినెన్స్-2020' నిదర్శనం. ఇది మన వైద్య సిబ్బంది భద్రతకు భరోసా కల్పిస్తుంది. వారి భద్రతపై రాజీపడే ప్రసక్తే లేదు' పేర్కొన్నారు.