శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 జనవరి 2022 (09:22 IST)

హస్తినను వణికిస్తున్న కొత్త కరోనా వేరియంట్

దేశ రాజధాని హస్తినను కొత్త కరోనా వేరియంట్ వణికిస్తుంది. గత నెల 30, 31 తేదీల్లో నమోదైన కరోనా కేసుల్లో 84 శాతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉండటం గమనార్హం. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. 
 
అంతేకాకుండా, సోమవారం విడుదల చేసిన మీడియా బులిటెన్ మేరకు ఢిల్లీలో పాజిటివిటీ రేటు 6.46 శాతంగా ఉంది. ఇది మరింతగా పెరిగితే మాత్రం రెడ్ అలెర్ట్‌ను ప్రకటించే అవకాశం ఉందని మంత్రి జైన్ వెల్లడించారు. 
 
మరోవైపు, ఢిల్లీలో కోవిడ్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అలాగే, విద్యా సంస్థలు, పార్కులు, సినిమా థియేటర్లు, జిమ్‌లు స్పాలు మూసివేశారు. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో రెస్టారెంట్లు, మెట్రోలు కొనసాగుతున్నాయి. ఇక కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో నడుస్తున్నాయి. 
 
సీఎం కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్ 
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్‌ మరోమారు కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయనకు తాజాగా కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈయన గతంలో ఒకసారి కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే.
 
ఇపుడు మరోమారు ఈ వైరస్ సోకింది. తనలో కరోనా లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయని, వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపారు. త్వరలోనే కోలుకుని తిరిగి బయటకు వస్తానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేనిద అందులో పేర్కొన్నారు. 
 
మరోవైపు, ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, ఒమిక్రాన్ కేసుల నమోదులో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. అలాగే, కరోనా వైరస్ వ్యాప్తి కూడా శరవేగంగా సాగుతోంది. ఇక్కడ కమ్యూనిటీ వ్యాప్తి ప్రారంభమైందని వైద్య నిపుణులతో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు.