1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జూన్ 2022 (20:17 IST)

మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ - డిప్యూటీ సీఎంగా ఫడ్నవిస్

eknath - fadnavis
మహారాష్ట్ర రాజకీయాలు సరికొత్త మలుపులు తిరిగాయి. శివసేన పార్టీ తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే ఏకంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్ కోశ్యారి గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే, ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణం చేశారు. 
 
రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్‌ శిందేతో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కొశ్యారీ ప్రమాణం చేయించగా, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణం చేశారు. భాజపా, శివసేన ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఫలితంగా మహారాష్ట్రలో మరోమారు భాజపా, శివసేన సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. 
 
అంతకుముందు మ‌హారాష్ట్ర సీఎంగా శివ‌సేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే ప్ర‌మాణ స్వీకారం చేయడానికి కాస్తంత ముందుగా బీజేపీ అధిష్ఠానం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. షిండే స‌ర్కారులో బీజేపీ పాలుపంచుకోవాల‌ని నిర్ణ‌యించింది. అంతేకాకుండా దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌ను షిండే కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా చేరాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 
 
బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా నుంచి వ‌చ్చిన‌ ఈ ప్ర‌తిపాద‌న‌కు ఫడ్న‌వీస్ తొలుత అంగీక‌రించ‌లేదు. షిండేనే సీఎంగా ఉంటార‌ని తానే ప్ర‌క‌టించాన‌ని, అంతేకాకుండా షిండే స‌ర్కారుకు బీజేపీ బ‌య‌టి నుంచి మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని ప్ర‌క‌టించానని న‌డ్డాకు ఫ‌డ్న‌వీస్ వివ‌రించారు. 
 
అయితే పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు డిప్యూటీ సీఎంగా చేరాల్సిందే అంటూ ఫ‌డ్న‌వీస్‌కు న‌డ్డా సూచించారు. అప్ప‌టికీ ఫ‌డ్న‌వీస్ అంగీక‌రించక‌పోవ‌డంతో రంగంలోకి దిగిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా... ఆయ‌నతో ఫోన్‌లో మాట్లాడారు. అమిత్ షా స‌ర్దిచెప్ప‌డంతో డిప్యూటీ సీఎంగా ఉండేందుకు ఫ‌డ్న‌వీస్ అంగీకరించారు.