1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 ఆగస్టు 2021 (11:19 IST)

86 యేళ్ల వయసులో పది పరీక్ష రాసిన మాజీ ముఖ్యమంత్రి

ఆయన వయసు 86 సంవత్సరాలు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈయన టెన్త్ పాస్ కాకుండానే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. కానీ, ప్రస్తుతం ఆయన జైలు జీవితాన్ని గడుపుతున్నారు. అయినప్పటికీ వృద్ధాప్యాన్ని సైతం లెక్క చేయకుండా పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించేందుకు కంపార్ట్‌మెంట్‌ పరీక్షలు రాశారు. అదికూడా ఇంగ్లీష్‌ పేపర్‌. 
 
హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలా బుధవారం పదో తరగతి ఇంగ్లిష్‌ పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జేబీటీ రిక్రూట్‌మెంట్ కేసులో 2013లో ఆయనకు సీబీఐ కేసు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తూనే పదో తరగతి పరీక్షలు రాశారు. కానీ అప్పుడు ఇంగ్లీష్ పరీక్ష రాయలేదు.
 
ఆ తర్వాత ఓపెన్‌లో భివాని ఎడ్యుకేషన్ బోర్డు 12వ తరగతి పరీక్షలు రాశారు. ఆగస్టు 5న ఆ పరీక్షల ఫలితాలు వచ్చాయి. కానీ చౌతాల ఫలితాన్ని బోర్డు నిలిపివేసింది. పెండింగ్‌లో ఉన్న పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష పూర్తి చేస్తేనే ఫలితాన్ని వెల్లడిస్తామని స్పష్టం చేసింది. దీంతో ఆయన సిర్సాలోని ఆర్య కన్య సీనియర్‌ సెకండరీ స్కూల్‌ పరీక్ష కేంద్రంలో కంపార్ట్‌‌మెంట్‌ పరీక్ష రాశారు.
 
ఈ సందర్భంగా అక్కడే ఉన్న విలేకరులు పలు ప్రశ్నలు అడగగా.. తాను ప్రస్తుతం విద్యార్థినని, నో కామెంట్స్‌ అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, చౌతాలో ఓ సహాయకుడిని పెట్టుకుని పరీక్ష రాయడం విశేషం.