శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2022 (09:07 IST)

నేడు గుజరాత్ తొలి దశ పోలింగ్ - రూ.478.65 కోట్ల డ్రగ్స్ పట్టివేత

polling
గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, తొలి దశ పోలింగ్ గురువారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. దక్షిణ గుజరాత్, కచ్ - సౌరాష్ట్ర  ప్రాంతాల్లో 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికార బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. 
 
గుజరాత్ రాష్ట్రంలో గత 27 యేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఈ దఫా కూడా గెలుపొంది మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తుంది. అయితే, ఈసారైనా విజయం సాధించి అధికారం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కలలు కంటోంది. 
 
మరోవైపు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలను తమ ప్రధాన ప్రచార అస్త్రాలుగా తీసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ .. పంజాబ్ రాష్ట్రంలో సంచలన విజయాన్ని నమోదు చేసినట్టుగా గుజరాత్ రాష్ట్రంలో కూడా గెలుపొందాలని భావిస్తుంది. 
 
ఇదిలావుంటే, గుజరాత్ రాష్ట్రంలో 478.65 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వడోదర శివారులోని ఓ తయారీ యూనిట్‌లో ఉగ్రవాద వ్యతిరేక బృందం వీటిని కైవసం చేసుకుంది. ఇందులో 63.7 కేజీల మెఫిడ్రోన్, 80.26 కేజేల ముడి పదార్థాలు, తయారీ మిషన్లు ఉన్నట్టు అధికారులు వివరించారు.