గురువారం, 17 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2024 (16:40 IST)

రైల్వే అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్‌లో కీలక మార్పు.. రైల్వే శాఖ నిర్ణయం

indian railway
అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్‌లో భారతీయ రైల్వే కీలక మార్పు చేసింది. దీపావళి పండుగకు ముందు ఈ కీలక మార్పు చేయడం గమనార్హం. ఇప్పటివరకు అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్ 120 రోజులుగా ఉండేది. దీన్ని ఇపుడు సగానికి తగ్గించింది. అంటే 60 రోజులకు కుదించింది. రైల్వే నిబంధనల ప్రకారం రైలు నిర్ణీత సమయానికి 120 రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు ఇప్పటివరకు ఉండేది. ఇకపై కాల పరిమితి 60 రోజులకే కుదించింది. 
 
ఈ కీలక నిర్ణయం నవంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని రైల్వే శాఖ వెల్లడించింది. అలాగే, నవంబర్ ఒకటో తేదీకి ముందు బుకింగ్ చేసుకునేవారికి కూడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నంకావని తెలిపింది. 
 
తాజ్ ఎక్స్‌ప్రెస్, గౌమతి ఎక్స్‌ప్రెస్, తదితర ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్ల విషయంలో బుకింగ్ నిబంధన యధాతథంగా కొనసాగుతుందని తెలిపింది. నిజానికి ఈ రైళ్లకు అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్ సమయం తక్కువగా ఉంది. అదేసమయంలో విదేశీయులకు మాత్రం 365 రోజుల అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.