1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 17 జూన్ 2024 (19:06 IST)

వామ్మో ఎండలు... అధిక ఉష్ణోగ్రత దెబ్బకు ఆగిపోయిన విమానం!!

దేశంలో వేసవి కాలం ముగిసినప్పటికీ పగటి పూట ఉష్ణోగ్రతలు మాత్రం ఇంకా ఏమాత్రం తగ్గడం లేదు. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇండిగో విమాన ప్రయాణానికి తీవ్ర ఆటంకం కలిగింది. గంటల పాటు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గాలి లేక కొందరు అస్వస్థతకు గురయ్యారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇండిగో విమానం 6ఈ 2521 ఢిల్లీ నుంచి బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా బయలుదేరేందుకు సిద్ధమైంది. మధ్యాహ్నం 2.30కు టేకాఫ్‌ కావాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదుకావడమే అందుకు కారణంగా తెలుస్తుంది. దీంతో ప్లైట్‌ టేకాఫ్‌కు 2 గంటలు ఆలస్యమైంది. అప్పటికే ప్రయాణికులు విమానంలో కూర్చున్నారు. డోర్‌ మూసివేయడంతో వేడి తీవ్రత ఎక్కువైంది. ఏసీ పనిచేయకపోవడంతో కొందరు ప్రయాణికులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
 
ఈ ఘటనపై స్పందించిన ఇండిగో వివరణ ఇచ్చింది. 'బాగ్‌డోగ్రా వెళ్లే విమానంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా సాంకేతిక లోపం తలెత్తింది. ప్రయాణికుల భద్రతకు ఇండిగో ప్రాధాన్యతనిస్తుంది. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. గమ్యస్థానానికి చేరుకునేందుకు చర్యలు జరుగుతున్నాయి' అని ఓ ప్రకటనలో పేర్కొంది.