1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 మే 2021 (15:33 IST)

కేరళ మంత్రివర్గంలో టీచరమ్మకు చోటు కల్పించని సీఎం పినరయి

కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఇందులో కేరళ టీచరమ్మగా గుర్తింపు పొందిన కెకె.శైలజకు చోటు కల్పించలేదు. 
 
నిజానికి కరోనా కట్టడిలో ఆమె ఎంతో మంచి పేరు సంపాదించారు. మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుండి నడిపించారు. ఆమె నిర్ణయాలను ప్రధాని నరేంద్ర మోడీ సైతం మెచ్చుకున్నారు. పలు మీడియా సంస్థలు ప్రశంసిస్తూ కథనాలు ప్రచురించాయి.
 
గత ప్రభుత్వంలో ఆరోగ్య శాఖామంత్రిగా పనిచేశారు. అలాంటి ‘టీచర్’ను తాజా కేబినెట్ నుంచి సీఎం పినరయి విజయన్ తప్పించేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 
 
ఈ రోజు ఆయన కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. అందులో టీచర్‌గా పిలుచుకునే కె.కె. శైలజకు మాత్రం చోటివ్వలేదు. కొత్త మంత్రివర్గానికి సంబంధించిన వివరాలను సీపీఎం నేత ఎ.ఎన్. షంషీర్ వెల్లడించారు.
 
మంత్రివర్గంలో సీపీఎం పార్టీ నుంచి సీఎం పినరయి విజయన్ ఒక్కరే పాతవారని, మిగతా 11 మంది మంత్రులంతా కొత్తవారే ఉంటారని ఆయన చెప్పారు. యువతకూ ఈసారి కేబినెట్‌లో ప్రాధాన్యముంటుందన్నారు. పాతవారికి ఈసారి చోటులేదన్నారు. ఇది పార్టీ తీసుకున్న నిర్ణయమన్నారు. 
 
పార్టీ ఎవరినీ వదులుకోబోదన్నారు. అందరూ పార్టీ నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనని చెప్పారు. 21 మంది మంత్రులతో ఈ నెల 20న సీఎం పినరయి విజయన్ ప్రమాణ స్వీకారం చేస్తారని సీపీఎం రాష్ట్ర ఇన్ చార్జి కార్యదర్శి, ఎల్డీఎఫ్ కన్వీనర్ ఎ. విజయరాఘవన్ చెప్పారు. 
 
మంత్రుల శాఖలను ముఖ్యమంత్రే నిర్ణయిస్తారన్నారు. కూటమిలో ప్రధాన పార్టీ అయిన సీపీఎం నుంచి 12 మంది, సీపీఐ నుంచి నలుగురు, కేరళ కాంగ్రెస్ (ఎం), జనతాదళ్ (ఎస్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ల నుంచి ఒక్కొక్కరికి మంత్రిగా అవకాశం కల్పించనున్నట్టు ఆయన వివరించారు.