శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2019 (09:40 IST)

ఈ-సిగరెట్స్ విక్రయాలపై నిషేధం? ఈ-సిగరెట్ అంటే ఏంటి?

పొగతాగడాన్ని మానుకునేందుకు అనేక మంది ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టిసారిస్తున్నారు. ఇందులోభాగంగా, ఈ-సిగరెట్లను కాల్చుతున్నారు. ఇవి కూడా ఆరోగ్యానికి హానికరంగా మారాయి. దీంతో ఈ-సిగరెట్స్‌ విక్రయాలు, దిగుమతి, సరఫరా, తయారీపై నిషేధం విధించే సూచనలు కనిపిస్తున్నాయి. వీటి నిషేధం కోసం ప్రత్యేకంగా ఓ ఆర్డినెన్స్‌ను కూడా రూపొందించారు. దీనికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయొచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. 
 
బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్రమంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఇందులో ఎలక్ట్రానిక్ సిగరెట్ల తయారీ, సరఫరా, దిగుమతి, విక్రయాలపై నిషేధం విధించే ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర వేయవచ్చని భావిస్తున్నారు. 
 
పొగతాగడాన్ని విడిచిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ-సిగరెట‍్లను ఆశ్రయిస్తున్నారు. ఈ- సిగరెట్లలో పొగాకు వాడకపోయినా ద్రవ రసాయనాలను మండించి వేపర్‌గా మలుస్తారు. వీటిని ఈ-సిగరెట్ల ద్వారా పీల్చడంతో స్మోకర్ల ఆరోగ్యం హానికరంగా మారుతుంది. అందుకే ఈ సిగరెట్ల తయారీ, దిగుమతి, రవాణా, సరఫరా, వీటికి సంబంధించి ప్రకటనలు ఇవ్వడం నేరంగా పరిగణిస్తున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 
 
ఈ సిగరెట్లను కలిగివుంటే ఆరు నెలల వరకూ జైలు శిక్ష రూ.50,000 జరిమానా విధించేలా వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ ముసాయిదా ఆర్డినెన్స్‌ను రూపొందించింది. కేంద్ర కేబినెట్‌ భేటీలో ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియా వర్గాల సమాచారం.