1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 జులై 2022 (21:13 IST)

18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

om birla
ఈ నెల 18వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు వీలుగా స్పీకర్ ఓం బిర్లా శనివారం అఖిలపక్ష నేతలతో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీల ఎంపీలు సహకరించాలని ఆయన కోరారు. 
 
ముఖ్యంగా ప్రతి ఒక్క సభ్యుడు.. సభా మర్యాదలను ఖచ్చితంగా కాపాడాలని కోరారు. సమావేశాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆయన.. అన్ని పార్టీల నేతలకు వివరించారు. ఈ వర్షాకాల సమావేశాలు జులై 18న ప్రారంభమై.. ఆగస్టు 12న ముగుస్తాయని ఓం బిర్లా వెల్లడించారు. 
 
దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై చర్చలు జరపాలని అన్ని పార్టీల నేతలందరికీ విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. శనివారం సాయంత్రం ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీకి భాజపా నుంచి ప్రహ్లాద్ జోషి, అర్జున్ రామ్‌మేఘవాల్ పాల్గొన్నారు. 
 
అలాగే, కాంగ్రెస్ పార్టీ నుంచి అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే, వైకాపా, ఆర్​ఎల్​జేపీ సహా పలు పార్టీల నేతలు హాజరయ్యారు. అయితే తెరాస మాత్రం అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉంది.