బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 24 ఏప్రియల్ 2019 (17:14 IST)

ఎన్డీ తివారీ కుమారుడి హత్య కేసు: భార్యే హంతకురాలు.. అరెస్ట్ చేసిన పోలీసులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్‌ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ కేసుకు సంబంధించి రోహిత్‌ భార్య అపూర్వ శుక్లాను ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై పోలీసులు ఆమెను మూడురోజుల పాటు విచారించి, బుధవారం అరెస్టు చేశారు. 
 
వైవాహిక జీవితంలో తలెత్తిన గొడవల కారణంగానే ఆమె భర్త రోహిత్ తివారీని హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. భర్త తాగిన మైకంలో ఉండగా ఆమె ఈ దారుణానికి పాల్పడిందన్నారు. అయితే ఈ హత్య కేసులో ఆమె ఎవరి సాయం తీసుకోలేదన్నారు. రోహిత్ ఊపిరాడకపోవడం వల్లే మృతి చెందినట్లు వైద్య నివేదికలో వెల్లడైన సంగతి తెలిసిందే. 
 
దీంతో బయటి వ్యక్తులు ఎవరూ లోనికి ప్రవేశించినట్లు ఆనవాలు లభించకపోవడంతో ఇంట్లోని వారే ఈ హత్య వెనుక కుట్రదారులుగా భావించి, ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులు రోహిత్ భార్య అపూర్వను ఆదివారం నాడు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. విచారణలో అపూర్వ పొంతనలేని సమాధానాలు చెప్పడం, ఘటన జరిగిన సమయంలో ఇంటిలో అమర్చి ఉన్న సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం పోలీసుల అనుమానాలను మరింత బలపరిచాయి.
 
ఈనెల 16వ తేదీన రోహిత్ అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే శవపరీక్ష నివేదికలో రోహిత్‌ది సహజ మరణం కాదని తేలడంతో కేసును క్రైమ్ బ్రాంచ్‌కి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో రోహిత్ తల్లి ఉజ్వల స్పందిస్తూ.. రోహిత్, అపూర్వ దంపతుల మధ్య ఆది నుండే సఖ్యత కొరవడిందని, పెళ్లైన మొదటిరోజు నుంచే వారి మధ్య విభేధాలు ఉన్నాయని ఆరోపించారు.