1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2019 (18:38 IST)

పెళ్లైన మరుసటి రోజే కన్యత్వ పరీక్ష..

పెళ్లంటే నూరేళ్ల పంట అని అందరూ అంటుంటారు. కానీ ఓ అమ్మాయి జీవితంలో మాత్రం ఆ పెళ్లి ఒక్కరోజు ముచ్చటే అయింది. భర్తతో సంసార జీవితాన్ని సాఫీగా గడపాలనుకున్న ఆమెకు..పెళ్లైన మరుసటి రోజు నుంచే అవమానాలు ఎదురయ్యాయి. ఉత్తర కర్ణాటకకు చెందిన ఒక అమ్మాయిని అదే ప్రాంతానికి చెందిన అబ్బాయి 2018 నవంబర్‌లో వివాహం చేసుకున్నాడు. 
 
ఇద్దరూ ఎంబీఏ పట్టభద్రులు. అంతేకాకుండా బాగా పేరున్న సంస్థలో పని చేస్తున్నారు. అయితే అమ్మాయి తల్లి వీరి పెళ్లికి పదిహేను రోజుల ముందు చనిపోయింది. దీంతో ఆ అమ్మాయి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. పెళ్లికి ముందే అమ్మ చనిపోవడంతో ఆమె మానసికంగా కూడా కుంగిపోయింది. ఈ సమయంలో ఆమె డిప్రెషన్‌లో ఉంటే తనను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని పెళ్లి కుమారుడు భావించాడు.
 
చివరకు పెళ్లైన మరుసటి రోజే నూతన వధువును ఆస్పత్రికి తీసుకెళ్లి కన్యత్వ పరీక్షతో పాటు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించాడు. దీంతో మరింత బాధతో ఆమె భర్తను విడిచి సోదరి ఇంట్లో మూడు నెలల పాటు ఉంది. కాగా భర్త మూడు నెలల తర్వాత విడాకుల కోసం పరిహార్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో బాధితురాలిని, భర్తను పిలిచి కౌన్సిలింగ్ ఇప్పించారు. 
 
తన భర్త చేసిన పనిని వారికి వివరించగా కౌన్సెలింగ్ నిర్వాహకులు షాక్ అయ్యారు. తనకు విడాకులే కావాలని భర్త మొండిగా పట్టుబట్టాడు. దీంతో చేసేదేమీ లేక తనను వేధిస్తున్నాడని భర్తపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.