1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జగదీష్
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (22:44 IST)

నాగార్జున అందుకే జగన్‌ను కలిశారట..!

సినీ ప్రముఖులు రాజకీయ నేతలను కలవడం సాధారణమై పోయింది. అందులోనూ కొంతమంది సినీ నటులైతే ఏకంగా రాజకీయాల్లోకే వెళ్ళిపోతున్నారు. అగ్ర నటులు కూడా రాజకీయ నేతలకు సపోర్ట్ చేస్తూ ప్రచారానికి సిద్ధమైపోతున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రచారం చేయడానికి రెఢీ అవుతున్నారు.
 
అయితే మంగళవారం ప్రముఖ నటుడు నాగార్జున ఏపీ ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డిని కలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. జగన్‌ను నాగార్జున కలవడానికి ఒకటే కారణమంటూ ప్రచారం జరిగింది. గుంటూరు ఎంపి సీటును జగన్‌ను నాగార్జున అడిగారని, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన ముందుగానే సీటును కన్ఫామ్ చేసుకోవడానికే జగన్ వద్దకు వచ్చారన్న ప్రచారం జరిగింది. 
 
కానీ జగన్‌ను నాగార్జున కలవడానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పాదయాత్రను జగన్ దిగ్విజయంగా పూర్తి చేసుకోవడంతో జగన్‌కు శుభాకాంక్షలు చెప్పడానికే మాత్రమే వెళ్ళారు తప్ప వేరే ఉద్దేశమే లేదంటున్నారు ఆయన సన్నిహితులు. నాగార్జున రాజకీయాల్లోకి వెళ్ళే ప్రసక్తే లేదని, ఆయనకు రాజకీయాలంటే అసలు ఇష్టం లేదంటున్నారు.