1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 జులై 2022 (08:37 IST)

బెంగాల్ వాసులను హడలెత్తిస్తున్న యాసిడ్ ఫ్లై

Nairobi Fly
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వాసులను నైరోబీ ఫ్లై లేదా యాసిడ్ ఫ్లై (ఈగలు) హడలెత్తిస్తున్నాయి. ఆఫ్రికా దేశానికి చెందిన ఈ ఈగలు ఈ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ముఖ్యంగా, ఈ రాష్ట్రంలోని సిలిగురి, డార్జిలింగ్ వంటి పలు ప్రాంతాల్లో ప్రవేశించి ప్రజల చర్మంపై కుడుతున్నాయి. దీంతో అస్వస్థతకు లోనవుతున్నారు. ఫలితంగా వందలాది జనం అనారోగ్యం బారినపడుతున్నారు. అయితే, ఈ ఈగల కాటుకు భయపడాల్సిన పనిలేదని, కానీ, జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని వైద్యులు చెబుతున్నారు.
 
ఈ ఆఫ్రికన్‌ ఈగ నారింజ, ఎరుపు, నలుపు.. మూడు రంగుల్లో ఉంటుంది. ఈ కీటక శరీరంలో పెడిటిన్‌ అనే ఆమ్ల పదార్థం (యాసిడ్‌) ఉంటుంది. ఇది మానవ చర్మానికి హాని కలిగిస్తుంది. ఉత్తరాదిలో హిమాలయాల దిగువన అధిక వర్షపాతం కారణంగా అక్కడ తిరుగుతున్నాయి. 
 
గతేడాది కంటే ఈ సంవత్సరం వర్షపాతం ఎక్కువగా నమోదవడం వల్ల యాసిడ్‌ ఈగల సంచారం అసాధారణ స్థాయిలో పెరిగింది. వాస్తవానికి ఈ కీటకాలు చర్మంపై కుట్టవు. ఒంటిపై వాలినప్పుడు వాటిని కొడితే మాత్రం రసాయనం లాంటి పదార్థాన్ని విడుదల చేస్తాయి. దీని కారణంగా చర్మంపై దద్దుర్లు వస్తాయి. 
 
ఆ తర్వాత అది అంటువ్యాధిలా మారే అవకాశం ఉంది. బాధితుల శరీరంపై నైరోబీ ఫ్లై దాడి చేస్తే ఆ పురుగు కుట్టినచోట  విపరీతమైన మంట, తర్వాత తీవ్రంగా నొప్పి ఉంటుందని బాధితులు చెబుతున్నారు. దీనివల్ల జ్వరం బారిన పడుతున్నామని, వాంతులు కూడా అవుతున్నాయని తెలిపారు.