1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 31 జులై 2021 (09:00 IST)

టెన్త్ క్లాస్ పరీక్ష రాసిన ఎమ్మెల్యే... ఎక్కడ?

చాలా మంది పాలకులకు కనీస విద్యార్హత కూడా ఉండదు. ప్రజాబలం, ధనబలం, అంగబలంతో అధికారంలోకి వస్తుంటారు. అయితే, కొందరు ప్రజాప్రతినిధులైన తర్వాత కూడా విద్యాభ్యాసం చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇలాంటి వారిలో ఈ శాసనసభ్యుడు ఒకరు. ఓ ఎమ్మెల్యే తాజాగా పదో తరగతి పరీక్షలను రాశారు. ఆయన పేరు పూర్ణచంద్ర స్వైన్. ఒడిషా శాసనసభలో బీజేడీ సభ్యుడు. సూరాడ నియోజకవర్గం నుంచి ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
 
ఒడిషా రాష్ట్రంలో శుక్రవారం నుంచి టెన్త్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు రాసేందుకు ఒడిశా శాసనసభ్యుడు పూర్ణచంద్ర స్వైన్ కూడా ఓ విద్యార్థిలాగా పదో తరగతి పరీక్ష రాసేందుకు వచ్చారు. ఆయన దూరవిద్య విధానంలో పది చదివారు. 
 
కరోనా నేపథ్యంలో ఒడిశా సర్కారు ఈ ఏడాది అందరినీ పాస్ చేసింది. తాము కేటాయించిన మార్కులు నచ్చనివారు పరీక్షలు రాసే అవకాశాన్ని సర్కారు కల్పించింది. దాంతో, ఎమ్మెల్యే పూర్ణచంద్ర ఎక్కువ మార్కుల కోసం పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నారు.
 
సూరాడలోని బాలికల ఉన్నతపాఠశాల పరీక్ష కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యేని మీడియా కెమెరాలు క్లిక్ మనిపించాయి. ఓ బైక్‌పై సాధారణ వ్యక్తిలా వచ్చారు. మరో బైక్‌పై సెక్యూరిటీ సిబ్బంది కూడా పరీక్ష కేంద్రం వద్దకు వచ్చారు. కరోనా నేపథ్యంలో థర్మల్ స్క్రీనింగ్ చేసిన అక్కడి సిబ్బంది ఆయనను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు.