శుక్రవారం, 18 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2024 (09:47 IST)

వారణాసి ప్రజలకు రూ.1360 కోట్ల దీపావళి కానుకలు.. 20న ప్రధాని మోడీ పర్యటన

narendra modi
తన సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 20వ తేదీన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వారణాసి ప్రజలకు రూ.1360 కోట్ల విలువ చేసే కానుకలు అందజేయనున్నారు. అంటే వివిధ రకాలైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే, రూ.460 కోట్ల విలువైన 14 ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించి, రూ.900 కోట్లతో ఏడు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. 
 
దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన సొంత నియోజకవర్గంలో తొలిసారి పర్యటించనున్నారు. పీఎం మోడీ టూర్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రధానమంత్రి కార్యాలయం ఖరారు చేసింది. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను యూపీ ప్రభుత్వం చేపట్టింది. ప్రధాని పర్యటన సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండు రోజుల పాటు వారణాసిలోనే మకాం వేసి, ఈ పర్యటన ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని, ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు నగరం మొత్తాన్ని అలంకరించాలని సూచించారు. 
 
కాగా ప్రధాని మోడీ వారణాసి పర్యటన ఐదు గంటల పాటు కొనసాగనుంది. అక్టోబరు 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు వారణాసికి చేరుకుని, అక్కడ నుంచి హర్హువా సంధా రింగ్ రోడ్డులోని శంకర్ నేత్రాలయకు చేరుకుంటారు. ఆస్పత్రి ప్రారంభోత్సవం తర్వాత సింగ్రా స్టేడియంలోని క్రీడా ప్రాంగణంలో వివిద క్రీడాకారులను ఉద్దేశింసి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుంచే అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.