1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (09:51 IST)

మే 3 తర్వాత ఆ ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు.. కానీ...

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇపుడు లాక్‌డౌన్ అమలు చేస్తోంది. తొలి దశ లాక్‌డౌన్ మార్చి 24వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు జరుగగా, రెండో దశ లాక్‌డౌన్ ఏప్రిల్ 15 నుంచి మే 3వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ రెండు దేశల లాక్‌డౌన్ కొంతమేరకు ఫలితమిచ్చింది. అయినప్పటికీ.. కరోనా వైరస్ వ్యాప్తి మాత్రం పలు ప్రాంతాల్లో తగ్గలేదు. దీంతో మే మూడో తేదీ తర్వాత కూడా మరో 15 రోజుల పాటు లాక్‌డౌన్ పొడగించాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్ర మోడీకి సూచన చేశారు. ముఖ్యమంత్రులు చేసిన సూచనలు, సలహాలు స్వీకరించిన ప్రధాని నరేంద్ర మోడీ, తన కేబినెట్ సహచరులతో సమావేశం నిర్వహించి ఆ తర్వాత లాక్‌డౌన్ పొడగింపు లేదా ఆంక్షల సడలింపుపై ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. 
 
ఒకవేళ మే మూడో తేదీన లాక్‌డౌన్‌లో కొంత సడలింపు ఇచ్చినప్పటికీ.. విద్యా సంస్థలు, ప్రజా రవాణా, షాపింగ్ మాల్స్‌ను పూర్తిగా బంద్ చేయాలన్న తలంపులో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, ప్రజలు గుమికూడే ప్రదేశాలైన.. విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్‌, ప్రార్థనా స్థలాలు, ప్రజా రవాణాతో పాటు మత, రాజకీయ, క్రీడా కార్యక్రమాలపై నిషేధం కొనసాగించే యోచనలో ప్రభుత్వం ఉంది. 
 
అంతేకాకుండా, రెడ్‌ జోన్లలో పూర్తిగా, మిగతా ప్రాంతాల్లో పాక్షికంగా ఆంక్షలు కొనసాగించాలని కేంద్రం యోచిస్తోంది. ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో ఉండే కార్యాలయాలు, దుకాణాలు, పరిశ్రమలను అనుమతించాలని చూస్తోంది. రెడ్‌ జోన్లలో ఇప్పటిమాదిరిగానే అన్ని కార్యకలాపాలను నిలిపివేసి.. ఇతర జోన్లలో ప్రజలు తాము పని చేసే చోటుకు వ్యక్తిగత వాహనాలపై వెళ్లి రావడానికి వీలు కల్పించే అవకాశం కనిపిస్తోంది.
 
ఇకపోతే, ప్రైవేటు కార్యాలయాలు నడిపే వాహనాల్లో సామాజిక దూరం పాటిస్తూ రాకపోకలు సాగించడానికి అవకాశం ఇచ్చే ఆలోచనలో కూడా కేంద్రం ఉంది. అత్యంత ప్రధానమైన అంశంగా ఉన్న వలస కార్మికులను సొంత ఊళ్లకు తరలించే విషయంపై కేంద్రం ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.