1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2022 (08:42 IST)

మహారాష్ట్ర క్రైసిస్ : 12 మంది శివసేన రెబెల్స్ ఎమ్మెల్యేలపై వేటు

eknath sinde
మహారాష్ట్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా 12 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కు శివసేన లేఖ రాసింది. మరోవైపు, గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో బస చేస్తున్న తిరుగుబాటు ఎమ్మెల్యేల సంఖ్య 40కి చేరుకుంది. అనర్హత వేటుకు సంబంధించిన మరికొందరి పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి.
 
మరోవైపు, శివసేన నుంచి ఒక్కొక్కరుగా రెబల్‌ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే 37 మంది ఎమ్మెల్యేలు గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్‌కు చేరుకోగా.. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లారు. దీంతో ఏక్‌నాథ్‌ షిండేతో కలుపుకొని మొత్తం రెబల్‌ ఎమ్మెల్యేల సంఖ్య 40కి చేరిందని సమాచారం. ఇంకవైపు, రెబల్‌ ఎమ్మెల్యేలంతా కలిసి ఏక్‌నాథ్ షిండేను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలుస్తోంది.
 
ఇదిలావుంటే, శివసేనకు పార్టీలో మొత్తం 55 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో మూడింట రెండొంతుల ఎమ్మెల్యేలు (37) షిండే వైపు చేరితే.. చట్టబద్ధంగా శాసనపక్ష హోదా పొందే అవకాశం రెబల్స్‌కు లభిస్తుంది. ఇప్పటికి అస్సాంకు చేరుకున్న ఎమ్మెల్యేల సంఖ్యను పోల్చుకుంటే రెబల్‌ వర్గానికి మ్యాజిక్‌ ఫిగర్‌ లభించినట్లే కనిపిస్తోంది. తాజా పరిస్థితుల్లో ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం కూలిపోయే సూచనలు కనిపిస్తున్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.