1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2019 (16:31 IST)

మహా 'పీఠముడి' : ఆర్ఎస్ఎస్‌ను ఆశ్రయించిన శివసేన

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అంశంలో నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. పైగా, ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న గడువు సమీపిస్తోంది. దీంతో శివసేన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను ఆశ్రయించింది. నిర్ణీత గడువులోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరని పక్షంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో శివసేన మోహన్ భగవత్‌కు ఓ లేఖ రాసింది. ఈ లేఖను శివసేన నేత కిశోర్ తివారీ రాశారు. 
 
ఇందులో 'కూటమి ధర్మానికి' బీజేపీ తూట్లు పొడుస్తున్నదనీ... మోహన్ భగవత్ జోక్యం చేసుకోవాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. కిశోర్ తివారీకి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. శివసేనకు మద్దతు ఇవ్వరాదంటూ కాంగ్రెస్, ఎన్సీపీలు నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలోనే తివారీ లేఖ వెలుగులోకి రావడం గమనార్హం. 
 
బీజేపీ-శివసేన కూటమికి అనుకూలంగా మహారాష్ట్ర ప్రజలు తీర్పు చెప్పారనీ.. కానీ రాష్ట్రంలో కూటమి ధర్మాన్ని అనుసరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ విఫలమైందని తివారీ ఆరోపించారు. దీంతో మహారాష్ట్ర రాజకీయ వర్గాల చూపంతా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ వైపు మళ్ళాయి. ఇరు పార్టీలు మెట్టు దిగని నేపథ్యంలో భగవత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది.