1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 డిశెంబరు 2020 (12:12 IST)

కాంగ్రెస్ పార్టీపై ప్రణబ్ కీలక వ్యాఖ్యలు.. నేను ప్రధాని అయి వుంటే.. చావుదెబ్బ తినేది కాదు..

కాంగ్రెస్ పార్టీపై దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకం ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్‌లో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రణబ్ రాసిన 'ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్' పుస్తకం త్వరలో మార్కెట్లోకి రానుంది. ప్రణబ్ తన స్వీయ అనుభవాలను ఆ పుస్తకంలో రాశారు. ఆ పుస్తకాన్ని రూప పబ్లికేషన్ జనవరిలో ప్రచురించనుంది.
 
ఆ పుస్తకంలో తాను రాష్ట్రపతి అయ్యాక.. కాంగ్రెస్ పార్టీ దిశానిర్దేశం కోల్పోయిందని, రాజకీయ లక్ష్యం లేకుండా ఆ పార్టీ మారినట్లు ప్రణబ్ తెలిపినట్లు సమాచారం. కోవిడ్ లక్షణాలతో ఆగస్టు 31వ తేదీన ప్రణబ్ ముఖర్జీ మృతి చెందిన సంగతి తెలిసిందే. తన పుస్తకంలో అనేక అంశాలను వెల్లడించిన దివంగత రాష్ట్రపతి ప్రణబ్‌.. ఒకవేళ తాను 2004లో ప్రధానిని అయి ఉంటే.. 2014లో కాంగ్రెస్ పార్టీ చావుదెబ్బ తినేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
 
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కల్లోలం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ సీనియర్లు కొందరు సోనియా వైఖరిని తప్పుపడుతూ లేఖ కూడా రాశారు. ఇలాంటి సమయంలో దివంగత కాంగ్రెస్ నేత అయిన ప్రణబ్ వ్యాఖ్యలు బయటకు రావడం ఆ పార్టీని మరింత సంక్షోభానికి గురిచేసింది.
 
తాను రాష్ట్రపతి అయిన తర్వాత.. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో రాజకీయ దృష్టి లోపించిందని, సోనియా గాంధీ పార్టీ వ్యవహారాలను చూసుకోలేకపోయారని, హౌజ్‌లో మన్మోహన్ లేకపోవడం వల్ల ఆయనతో ఇతర ఎంపీలకు సంబంధాలు తెగిపోయినట్లు ప్రణబ్ తన పుస్తకంలో వివరించారు.
 
దేశ పరిపాలన పూర్తిగా ప్రధాని హస్తాల్లో ఉంటుందని, కానీ కూటమిని కాపాడుకునే ప్రయత్నంలోనే మాజీ ప్రధాని మన్మోహన్ ఉండిపోయినట్లు ప్రణబ్ తన పుస్తకంలో చెప్పారు. కానీ ప్రధాని మోదీ మాత్రం తన తొలి టర్మ్‌ను నిరంకుశం మాదిరిగా పాలించినట్లు చెప్పారు.