1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 జులై 2022 (15:18 IST)

ఉడిపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి ప్రాణాలు తీసిన అంబులెన్స్

ambulance
కర్నాటక రాష్ట్రంలోని ఉడిపిలో ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ ఒకటి ఏకంగా నలుగురు ప్రాణాలను హరించింది. ఉడిపి జిల్లా శిరూర్ టోల్ ప్లాజా వద్ద అమిత వేగంతో దూసుకొచ్చిన ఈ అంబులెన్స్ నియంత్రణ కోల్పోయి టోల్ గేట్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
శిరూర్ టోల్ ప్లాజా వద్ద అంబులెన్స్ చేరుకునేలోపే టోల్ గేట్ సిబ్బంది ఒక లేన్‌కు ఉన్న బారికేడ్లను తొలగించారు. అయితే రోడ్డుపై వర్షపు నీరు ఎక్కువగా నిలిచివుండటంతో అమితవేగంతో వచ్చిన డ్రైవర్ బ్రేకులు వేసినప్పటికీ అంబులెన్స్ నియంత్రణ కోల్పోయి బోల్తాపడింది. 
 
అంబులెన్స్ వేగాన్ని తగ్గించేందుకు డ్రైవర్ బ్రేక్ వేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. చనిపోయిన వారిలో రోగితో మరో ముగ్గురు ఉన్నారు. 
 
ఈ ముగ్గురు రోగి గంజనన్ గోపితా్థ నాయక్‌తో వచ్చిన అటెండర్లు. వీరిని జ్యోతి లోకేష్ నాయక్, మంజునాథ్ నాయక్, రోగి బంధువు లక్ష్మణ్ నాయక్‌లు గుర్తించారు. అంబులెన్స్ డ్రైవర్, టోల్ ప్లాజా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరు కొనఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.