1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జెఎస్కె
Last Updated : శనివారం, 24 జులై 2021 (12:07 IST)

నిర్మ‌లాజీ ... విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకాన్నిఆపండి!!

విశాఖ ఉక్కు ఉద్య‌మం రోజు రోజుకు తీవ్రం అవుతున్న త‌రుణంలో వైసీపీ ఎంపీలు మ‌రో ప్ర‌య‌త్నం చేశారు. ఢిల్లీలో ఉక్కు కార్మిక సంఘాల నేతలతో కలిసి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌(ఆర్‌ఐఎన్‌ఎల్‌)ను విక్రయించే ఆలోచనను ఉపంసహరించుకోవాలని నిర్మలాజీకి విజ్ఞప్తి చేశారు. 
 
అనేక ఏళ్ళ పోరాటాలు, 32 మంది ఆత్మబలిదానాల అనంతరం 1966లో విశాఖ ఉక్కు పరిశ్రమ ఆవిర్భవించి ఆంధ్రుల చిరకాల కల నెరవేరింద‌ని ప్ర‌తినిధి బృందం పేర్కొంది. ఈ పరిశ్రమ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉంద‌ని, ప్రభుత్వ రంగ సంస్థలలో నవరత్నంగా నిలిచిన విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్‌కే ఆభరణం వంటిద‌ని వివ‌రించారు. 35 వేల మంది ఉద్యోగులు, కార్మికులతోపాటు లక్షకుపైగా కుటుంబాలు విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌పై ఆధారపడి జీవనోపాధిని కొనసాగిస్తున్నాయి. స్టీల్‌ ప్లాంట్‌ కారణంగానే విశాఖపట్నం నగరం మహా నగరంగా విస్తరించి, రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా భాసిల్లుతోందని విజయసాయి రెడ్డి మంత్రికి వివరించారు.
 
ఇటీవల దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టించిన సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ద్వారా దేశంలోని అనేక ప్రాంతాలకు లిక్విడ్‌ మెడికల్‌ ఆక్జిజన్‌ను రైళ్ళ ద్వారా తరలించి లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టిన విషయాన్ని ఆయన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో ఉత్పతి అయ్యే స్టీల్‌ నాణ్యతలో ప్రపంచస్థాయి సంస్థలకు పోటీ ఇస్తుంది. అలాంటి సంస్థ కేవలం సొంతంగా గనులు లేకపోయినందునే నష్టాలను చవిచూడాల్సి వస్తోందని అన్నారు.

కేవలం ఇనుప ఖనిజాన్ని మార్కెట్‌ రేటుకు కొనుగోలు చేయడం కోసమే ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఏటా 300 కోట్ల రూపాయలను అదనంగా భరించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆర్‌ఐఎన్‌ఎల్‌కు సొంత గనులు కేటాయించి, అప్పులను ఈక్విటీ కింద మారిస్తే, అతి తక్కువ కాలంలోనే విశాఖ ఉక్కు తిరిగి లాభాల బాట పడుతుంది. తద్వారా ఆ లాభాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి భారీగా డివిడెండ్లు చెల్లిస్తుందని ఆర్థిక మంత్రికి ఆయన సమర్పించిన వినతి పత్రంలో వివరించారు.