శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 మార్చి 2020 (14:48 IST)

సుప్రీంకోర్టు మూసివేత .. ఇక ఇళ్లవద్ద నుంచే కేసుల విచారణ

కరోనా మహమ్మారి బారిపడకుండా ఉండేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 75 జిల్లాల్లో కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించింది. అయితే, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం మరో అడుగు ముందుకేసి.. తమ రాష్ట్రంలో ఈ నెల 31వ తేదీ వరకు ఏకంగా లాక్‌డౌన్ ప్రకటించాయి. 
 
ఇపుడు లాక్‌డౌన్ ప్రకటించడం దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వంతువచ్చింది. ఇక నుంచి సుప్రీంకోర్టు న్యాయ‌వాదులు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా త‌మ వాద‌న‌లు వినిపించాల‌ని సూచించింది. ఇక‌పై న్యాయ‌వాదులు నేరుగా కోర్టుకు వ‌చ్చి వాదించాల్సిన అవ‌స‌రం లేద‌ని, అత్య‌వ‌స‌ర కేసులకు సంబంధించి న్యాయ‌వాదులు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారానే త‌మ వాద‌న‌లు వినిపించాల‌ని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే పేర్కొన్నారు. 
 
ఈ మేర‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామ‌ని, న్యాయ‌వాదుల‌కు కొన్ని లింకులు ఇస్తామ‌ని, ఆ లింకుల ద్వారా వీడియో కాల్స్‌ క‌నెక్ట్ చేసుకోవ‌చ్చ‌ని సీజేఐ తెలిపారు. స్కైప్ ద్వారాగానీ, మ‌రేఇత‌ర సాధ‌నాల ద్వారాగానీ లాయ‌ర్లు త‌మ వాద‌న‌లు వినిపించ‌వ‌చ్చ‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ లాక్‌డౌన్ ఏప్రిల్ నాలుగో తేదీ వరకు ఉంటుందని పేర్కొన్నారు. 
 
ఇదిలావుంటే, కోర్టు భ‌వ‌నంలోని లాయ‌ర్ల చాంబ‌ర్లు అన్నింటిని సోమ‌వారం సాయంత్రం 5 గంట‌ల నుంచి మూసివేయాల‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది. ఇప్ప‌టికే న్యాయ‌వాదుల ఎల‌క్ట్రానిక్ పాసుల‌ను కూడా ర‌ద్దుచేసిన సుప్రీంకోర్టు..  కోర్టులో లాయ‌ర్ల‌కు సంబంధించిన ముఖ్య‌మైన డాక్యుమెంట్లు ఏవైనా ఉంటే మంగ‌ళ‌వారం సాయంత్రానిక‌ల్లా తీసుకెళ్లాల‌ని సూచించింది.