1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 మే 2021 (08:25 IST)

రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు... ఆక్సిజన్ సరఫరాకు టాస్క్‌ఫోర్స్

దేశంలో కరోనా వైరస్ మరణ మృదంగం కొనసాగిస్తోంది. ప్రతి రోజూ వేలాది మంది ప్రజలు ఈ వైరస్ సోకి ప్రాణాలు కోల్పోతున్నారు. అదేసమయంలో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆక్సిజన్‌ సరఫరాలోనూ కేంద్రం వివక్ష చూపుతోంది. దీంతో సుప్రీంకోర్టు రంగంలోకిదిగింది. 
 
కరోనా రెండో దశ ఉద్ధృతితో దేశంలో ఆరోగ్య సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. మహమ్మారి నియంత్రణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని పలు దఫాలుగా తూర్పారబట్టిన సుప్రీంకోర్టు.. పరిస్థితులను చక్కదిద్దేందుకు నడుం బిగించింది. 
 
ఆక్సిజన్‌ అందక కరోనా రోగులు పిట్టల్లా రాలుతున్న దృశ్యాలు నిత్యకృత్యంగా మారడంతో.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య శాస్త్రీయంగా, హేతుబద్ధంగా, సమానరీతిలో ఆక్సిజన్‌ను పంపిణీ చేసే విధానాన్ని రూపొందించేందుకు 12 మంది సభ్యులతో జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. 
 
అలాగే కొవిడ్‌ చికిత్సకు అవసరమైన ఔషధాలకు కొరత ఏర్పడకుండా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా ఈ టాస్క్‌ఫోర్స్‌ సూచనలు చేయనుంది. భవిష్యత్‌లో తలెత్తే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలకు సహకారం అందించనున్నది.