గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 జూన్ 2020 (20:44 IST)

తమిళనాడులో జూలై 31 వరకు లాక్డౌన్ పొడగింపు...

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్‌ను వచ్చే నెల 31వ తేదీ వరకు పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ముఖ్యంగా, జూలై నెలలో వచ్చే నాలుగు ఆదివారాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలుకు ఆదేశాలు జారీచేశారు. అలాగే, చెన్నైతో పాటు.. కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో ఈ నెల 5వ తేదీ వరకు సంపూర్ణ లాక్డౌన్ యధావిధిగా కొనసాగనుంది. ఆరో తేదీ నుంచి 19వ తేదీ వరకు పాక్షిక సడలింపులు ఇవ్వనుంది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ఆదేశించారు. 
 
మరోవైపు, తమిళనాడు రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజు వేలాది కొత్త కేసులు నమోదవుతున్న ఈ రాష్ట్రంలో... సోమవారం కూడా కరోనా మరింత ప్రభావాన్ని చూపింది. గత 24 గంటల్లో కొత్తగా 3,949 కేసులు నమోదయ్యారు. ఏకంగా 62 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలలో అర్థంకాని పరిస్థితులు తమిళనాడులో నెలకొన్నాయి. అత్యధిక కేసుల విషయంలో ప్రస్తుతం మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత తమిళనాడు మూడో స్థానంలో ఉంది.
 
తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 86,224కు చేరుకుంది. మొత్తం 1,141 మంది మృత్యువాత పడ్డారు. ఇక చెన్నై విషయానికి వస్తే.. ఆదివారం ఒక్కరోజే 2,167 కొత్త కేసులు నమోదయ్యాయి. వాటితో కలిపి చెన్నైలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 55,969కి చేరుకున్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి మరెంత భయానకంగా ఉంటుందోనని అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.