1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 మే 2022 (09:34 IST)

తమిళనాడులో తొలిసారి "No Religion - No Caste" సర్టిఫికేట్ జారీ

naresh couple
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి "No Religion No Caste" సర్టిఫికేట్‌ను జారీచేసింది. ఇపుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన నరేష్ కార్తీక్ - గాయత్రి దంపతులకు విల్మ అనే మూడేళ్ల కుమార్తె ఉంది.


ఆ పాపను కిండర్ స్కూల్‌లో చేర్పించేదుకు వెళ్లారు. స్కూల్ దరఖాస్తు ఫారంలో కులం, మతం ఖాళీగా వదలిపెట్టారు. అయితే, ఈ కాలం ఖాళీగా వదిలిపెడితే సీటు ఇవ్వమని స్కూల్ యాజమాన్యం తెగేసి చెప్పింది. ఆ తర్వాత అనేక పాఠశాలలను తిరిగారు. కానీ, ఆ పాపను చేర్చుకునేందుకు ఏ ఒక్క పాఠశాల యాజమాన్యం అంగీకరించలేదు. 

 
దీంతో సీడ్‌రీప్స్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడైన నరేష్ కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ సమీరన్‌ను ఆశ్రయించారు. ఆయన చొరవతో సమస్య పరిష్కారమైంది. చిన్నారి తల్లిదండ్రులు సమర్పించిన అఫిడవిట్‌తో కోయంబత్తూరు నార్త్ తాహసీల్దారు వారికి "కులం లేదు.. మతం లేదు" (నో రిలిజియన్ - నో క్యాస్ట్) అనే సర్టిఫికేట్‌ను జారీచేశారు. ఈ తరహా సర్టిఫికేట్‌ను పొందడం వల్ల తమ కుమార్తె ప్రభుత్వ రిజర్వేషన్లు, ప్రత్యేకాధికారాలకు అనర్హురాలిగా మారుతుందనే విషయం తమకు తెలుసని ఆ విషయాన్ని కూడా వారు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 

 
కాగా, కోవై నార్త్ తాహసీల్దారు జారీచేసిన అఫిడవిట్ ప్రకారం బేబీ విల్మ ఏ కులానికి, మతానికి చెందినది కాదు. మతం లేదు. కులం లేదు అనే సర్టిఫికేట్‌ను పొందొచ్చన్న విషయం చాలా మంది తల్లిదండ్రులకు తెలియదని, ఇలాంటి ధృవీకరణ పత్రాన్ని పొందేందుకు మరింత మంది తల్లిదండ్రులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.