ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 జూన్ 2021 (18:13 IST)

మరో కొత్త కరోనా వేరియంట్ : డెల్టా ప్లస్‌తో థర్డ్ వేవ్ ముప్పు

Delta Plus
కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకుంటున్న తరుణంలో అన్ని రాష్ట్రాలు అన్‌లాక్ ప్రక్రియను మొదలెడుతున్నాయి. కానీ దేశంలో కొత్త వేరియంట్ జనాలను భయపెడుతోంది. ఇటు మహారాష్ట్రలో, అటు మధ్యప్రదేశ్ లోనూ నూతన వేరియంట్ వెలుగు చూసినట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించాయి. దీంతో కరోనా మహమ్మారి థర్డ్ వేవ్‌తో విజృంభిస్తుందని వైద్యారోగ్య శాఖ అంచనా వేస్తోంది.
 
దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియెంట్ వల్ల థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని మహారాష్ట్ర కోవిడ్19 టాస్క్‌ఫోర్స్ , వైద్య నిపుణుల బృందం హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం సీఎం ఉద్ధవ్ థాక్రేకు నివేదిక సమర్పించారు. 
 
డెల్టా ప్లస్ వేరియెంట్‌తో థర్డ్ వేవ్ వస్తే రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో రెండు నెలల్లో థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముందని వివరించారు. అయితే, ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే సెకండ్ వేవ్ ముగియక ముందే విజృంభించవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ మహిళకు నూతన వేరియంట్ కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్య నిపుణులు గుర్తించారు. ఇది అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్నారు. మహిళకు సోకిన కొత్త వేరియంట్ నిజమేనని మధ్యప్రదేశ్ వైద్య విద్యా శాఖ మంత్రి విశ్వస్ సారంగ్ ధ్రువీకరించారు. 
 
ఎన్‌సిడిసి (నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) నివేదికలో నూతన వేరియంట్ సంబంధించి పేర్కొన్నట్లు ఆయన వెల్లడించారు. కొత్త వేరియంట్ కరోనా వైరస్ సోకిన మహిళ కోవిడ్ టీకా సైతం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. అయితే, వైరస్ వ్యాప్తి నియంత్రణకు కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహిస్తున్నట్లు మంత్రి విశ్వస్ తెలిపారు. సదరు మహిళకు చికిత్స కొనసాగుతున్నట్లు.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.