శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 16 జూన్ 2021 (18:05 IST)

తిరుమలలో మళ్ళీ తగ్గిపోయిన భక్తుల రద్దీ, థర్డ్ వేవ్ భయం మొదలైందా?

కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంటున్నాయి. గతంతో పోలిస్తే కరోనా కేసులు బాగా తగ్గాయని.. ఆరు శాతం మాత్రమే కరోనా కేసులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఈనెల 18వ తేదీ నుంచి పర్యాటక శాఖలను తిరిగి పునఃప్రారంభించాలని ఆలోచనలో ప్రభుత్వం కూడా ఉంది.
 
మొదటి వేవ్ కరోనా నుంచి తిరుమలలో ఆదాయం బాగా తగ్గిపోయింది. అందుకు కారణం కేసుల సంఖ్య బాగా పెరగడంతో మూడు నెలల పాటు తిరుమల ఆలయంలోకి భక్తుల అనుమతిని నిలిపివేశారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీవారి హుండీ ఆదాయానికి భారీగానే గండిపడింది.
 
ఇక సెకండ్ వేవ్‌లో కూడా అదే పరిస్థితి. భక్తుల అనుమతిని కొనసాగిస్తున్నారు కానీ పరిమిత సంఖ్యలో టిక్కెట్లను ఇస్తున్నారు. ఆఫ్ లైన్లో టోకెన్లను నిలిపివేసి ఆన్ లైన్లోనే టోకెన్లను అందిస్తున్నారు. గత 15 రోజుల ముందు కాస్త భక్తుల రద్దీ పెరిగినట్లు అనిపించినా ప్రస్తుతం మాత్రం బాగా తగ్గిపోయింది. 
 
టోకెన్లు తీసుకున్న భక్తులు తిరుమలకు రావడం లేదు. దీంతో తిరుమల నిర్మానుష్యంగా మారిపోయింది. హుండీ ఆదాయం కూడా తగ్గిపోయింది. తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య తీరు కూడా అలాగే వుంది. విఐపిలు కూడా బాగా తగ్గారు. ఉదయం మార్నింగ్ బ్రేక్‌లో వెళ్ళే విఐపిల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 
 
థర్డ్ వేవ్ ప్రారంభమవుతుందన్న ప్రచారం ఊపందుకుంటున్న పరిస్థితుల్లో ఇదేవిధంగా భక్తుల రద్దీ ఉంటుందని.. ఇప్పట్లో రద్దీ పెరిగే అవకాశం లేదన్న అభిప్రాయానికి వచ్చేశారు టిటిడి అధికారులు.