శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 జూన్ 2022 (16:57 IST)

సీఎం ఉద్ధవ్ ఠాక్రే నుంచి శాంతి మంత్రం - మాట్లాడుకుందాం రండంటూ కబురు

Uddhav Thackeray
తనపై తిరుగుబాటు చేసిన సొంత పార్టీ ఎమ్మెల్యేలకు శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నుంచి కబురు వెళ్లింది. ముంబైకు వస్తే అన్ని విషయాలు మాట్లాడుకుందాం రండి అంటు విజ్ఞప్తి చేశారు. 
 
పార్టీ నుంచి తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు కొందరు టచ్‌లో ఉన్నారంటూ శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించగా.. అదంతా అవాస్తవమేనని తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే అంటున్నారు. అంతేకాకుండా, పార్టీ అధిష్టానంతో టచ్‌లో ఉన్న ఆ ఎమ్మెల్యేల పేర్లు కూడా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
 
ఈ పరిణామాల క్రమంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే గౌహతిలోని స్టార్‌ హోటల్‌లో బస చేసిన రెబల్‌ ఎమ్మెల్యేలకు కీలక విజ్ఞప్తి చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా గౌహతిని వీడి ముంబైకు తిరిగి వస్తే తనతో కూర్చొని మాట్లాడితే పరిష్కారం దొరుకుతుందని లేఖ రాశారు. 
 
'మీలో చాలా మంది మాతో టచ్‌లో ఉన్నారు.. అంతేకాకుండా మీరంతా శివసేన గుండెల్లో ఉన్నారు. రండి.. మాట్లాడుకుందాం.. అప్పుడే ఒక పరిష్కారం దొరుకుతుంది' అని అన్నారు. 'సమయం ఇంకా మించిపోలేదు. నాతో కూర్చొని మాట్లాడండి. తాజా పరిణామాలతో శివసైనికులు, ప్రజల్లో ఏర్పడిన అనేక సందేహాలను తొలగించాలన్నారు. 
 
ఎవరి మాటలకూ లొంగిపోవద్దు. శివసేన మీకు ఇచ్చిన గౌరవం మరెక్కడా దొరకదు. మీరు వచ్చి నాతో మాట్లాడితేనే ఏదో ఒక పరిష్కారం లభిస్తుంది. ఒక పార్టీ అధ్యక్షుడిగా, కుటుంబ పెద్దగా మీ అందరి పట్ల నేను ఆందోళనతో ఉన్నా' అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.