శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2020 (19:39 IST)

#FactCheck : ఒక్కో బ్యాంకు ఖాతాలో రూ.3 వేలు చొప్పున జమ!!! (video)

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కలిగించిన నష్టం అంతాఇంతాకాదు. ఈ మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్రం లాక్డౌన్ అమలు చేసింది. దీంతో అనేక కంపెనీలు మూతపడ్డాయి. ఫలితంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోయి నిరుద్యోగులయ్యారు. ఈ క్రమంలో కరోనా కష్టం నుంచి కేంద్రం ఆదుకోనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో బ్యాంకు ఖాతా కలిగిన ప్రతి ఒక్కరికీ రూ.3 వేల చొప్పున కేంద్రం జమ చేయనుందనే వార్త ప్రస్తుతం యూట్యూబ్‍‌లో చక్కర్లు కొడుతోంది. 
 
'ప్రధాన మంత్రి మాన్‌ధన్ యోజన' కింద అకౌంట్లు ఉన్న వాళ్లందరికీ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు రూ.3,000 చొప్పున జమ చేయనుందని చెబుతున్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంత?. ఏమాత్రం నిజం లేదని, అవాస్తవిక కథనమని, ఇలాటి ప్రకటన ఏదీ కేంద్రం చేయలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఒక ట్వీట్‌లో స్పష్టం చేసింది. 
 
ఇందులో 'ప్రధాని మాన్‌ధన్ యోజన కింద అకౌంట్లు ఉన్న వారందరికీ రూ.3000 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంటూ యూ ట్యూబ్ వీడియో‌ ఒకటి క్లెయిమ్ చేసింది. ఈ క్లెయిమ్‌లో నిజం ఎంతమాత్రం లేదు. ఇదో నకిలీ వార్త. ఇలాంటి ఏ స్కీమ్ కింద కూడా ప్రభుత్వం రూ.3000 చెల్లించడం లేదు' అంటూ పీఐబీ ట్వీట్ చేసింది. 
 
మరోవైపు, ప్రభుత్వం సైతం గతంలో సోషల్ మీడియోలా వస్తున్న నిర్ధారణ కాని వార్తలపై పలుమార్లు వివరణ ఇచ్చింది. నకిలీ వార్తలను ఎవరూ షేర్ చేయవద్దని, ఇలాంటివి షేర్ చేసేటప్పుడు విశ్వసనీయ సమాచారం తీసుకుని, పూర్తిగా నిర్దారణ చేసుకున్న తర్వాతే షేర్ చేయాలని సూచించింది.