శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (10:26 IST)

భారత్‌లో అత్యంత కఠినమైన రాత పరీక్ష ఏది? ఆనంద్ మహీంద్రా ట్వీట్

anand mahindra
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ సూచన చేశారు. మన దేశంలో నిర్వహించే రాత పరీక్షల్లో అత్యంత కఠినమైన పరీక్షపై ఆరా తీసి ఓ విషయాన్ని కనుగొన్నారు. దీనిపై ఆయన సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు. నిజానికి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఆయన తాజాగా చేసిన ట్వీట్ ఇపుడు వైరల్ అయింది. 
 
దేశంలో అత్యంత కఠినమైన ఎగ్జామ్ ఏది అన్నదే ఆ పోస్టులో ప్రధాన టాపిక్. "ఇటీవల నేను 12th ఫెయిల్ అనే సినిమా చూశాను. ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది కుర్రకారుతో మాట్లాడాను. మన దేశంలో నిర్వహించే రాత పరీక్షల్లో అత్యంత కఠినమైన పరీక్ష ఏది? అని అడిగాను. నేను మాట్లాడిన వారిలో ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్ కూడా ఉన్నాడు. అతడు ఓ బిజినెస్ స్టార్టప్ ఏర్పాటులో పాలుపంచుకున్న వ్యక్తి. అతడు కూడా అత్యంత కఠినమైన పరీక్షగా యూపీఎస్సీ పరీక్షను పేర్కొన్నాడు. ఐఐటీ జేఈఈ కంటే యూపీఎస్సీ ఎగ్జామ్ చాలా కష్టమైనదని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ అందరి అభిప్రాయం ఇదే అయితే... ఈ కింది జాబితాను వెంటనే మార్చాల్సిందే" అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
 
పైగా, ప్రపంచంలోని అత్యంత కఠినమైన పరీక్షల వరల్డ్ ర్యాంకింగ్ జాబితాను కూడా రీట్వీట్ చేశారు. ఆ జాబితాలో చైనాకు చెందిన గావో కావో పరీక్ష అత్యంత కఠినమైన పరీక్షగా నెం.1 స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఐఐటీ జేఈఈ, మూడో స్థానంలో యూపీఎస్సీ ఉంది. ఆనంద్ మహీంద్రా సర్వే ప్రకారం ఈ జాబితాలో యూపీఎస్సీ ఎగ్జామ్ రెండో స్థానానికి, ఐఐటీ జేఈఈ పరీక్ష మూడో స్థానానికి మార్చాల్సి ఉంటుందని ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.