గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (17:23 IST)

మోస‌గాడు.. కోటి రూపాయలు గోవిందా.. మోసపోయిన యువతి

woman
మోస‌గాడి మాట‌లు విని విజ‌య‌వాడ‌కు చెందిన ఓ యువ‌తి కోటి రూపాయ‌ల‌కు పైగానే పోగొట్టుకుంది. విలాసవంతమైన జీవితానికి ఆశపడి కోటి రూపాయలను పోగొట్టుకుంది. వివరాల్లోకి వెళితే.. విజ‌య‌వాడ‌లోని దేవీన‌గ‌ర్‌కు చెందిన ఓ యువ‌తి ఎంటెక్ పూర్తి చేసింది. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప‌నిచేస్తోంది. 
 
పెళ్లి సంబంధాల కోసం త‌న ప్రొఫైల్‌ను ఒక మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. అది చూసి కె.శ్రీకాంత్ అనే యువ‌కుడు ఈ ఏడాది ఏప్రిల్ 19న ఆమెకు ఫోన్ చేశాడు. త‌న ఫ్యామిలీ విశాఖ‌ప‌ట్నంలో ఉంటుంద‌ని.. తాను అస్ట్రాజెనికా ఫార్మా కంపెనీలో ప‌నిచేస్తున్నాన‌ని చెప్పాడు. 
 
శ్రీకాంత్ డీటైల్స్‌, అత‌ని తీరు న‌చ్చ‌డంతో అత‌నితో పెండ్లికి స‌ద‌రు యువ‌తి అంగీక‌రించింది. పెళ్లి సాకుతో ఆమెతో మాట్లాడటం మొదలెట్టాడు. ఓ ప్రాజెక్ట్ నిమిత్తం అమెరికా వెళ్తున్నాన‌ని, పాస్‌పోర్టు, వీసా తీసుకోవాల‌ని ఇందుకోసం సిబిల్ స్కోర్ 842 పాయింట్ల వ‌ర‌కు ఉండాల‌ని న‌మ్మించాడు.
 
సిబిల్ స్కోర్ పెంచుకునేందుకు వివిధ బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డులు అప్లై చేసింది. మైక్రోఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలు తీసుకుంది. అలా వ‌చ్చిన రూ.1.06కోట్ల‌ను శ్రీకాంత్ సూచ‌న మేర‌కు హ‌రీశ్ సంపంగి అనే వ్య‌క్తి ఖాతాలోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు. 
 
అప్పట్నుంచి శ్రీకాంత్ వాళ్ల ఫోన్ల‌కు స‌మాధానం ఇవ్వ‌డం మానేశాడు. దీంతో మోస‌పోయామ‌ని గ్ర‌హించిన స‌దరు యువ‌తి ఈ నెల 15న‌.. విజ‌య‌వాడ సైబ‌ర్ క్రైం పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.