1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 1 నవంబరు 2021 (18:43 IST)

ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం, తమిళనాడులో చెన్నైలకు వాతావరణ ముప్పు, ఎలాగంటే?

అస్సాం, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్నాటక, బీహార్‌ రాష్ట్రాలు అసాధారణ వాతావరణ పరిస్ధితులు అయినటువంటి వరదలు, కరువు, తుఫానుల ప్రభావానికి అధికంగా గురయ్యే అవకాశాలున్నాయని నేడు కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌ (సీఈఈడబ్ల్యు) తొలిసారిగా విడుదల చేసిన క్లైమెట్‌ వల్నరబిలిటీ నివేదికలో వెల్లడించింది.
 
మొత్తంమ్మీద 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అసాధారణ వాతావరణ పరిస్థితుల ప్రభావానికి గురయ్యే అవకాశాలున్నాయని వెల్లడించింది. తరచుగా స్థానిక ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడంతో పాటుగా బలహీన వర్గాలపై ఇది తీవ్ర ప్రభావమూ చూపుతుందని వెల్లడించింది. భారతదేశంలో దాదాపు 80% మంది వాతావరణ ప్రమాదాలు కలిగే ప్రాంతాలలోనే నివశిస్తున్నారు.
 
రాబోతున్న సీఓపీ-26లో భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు తప్పనిసరిగా క్లమెట్‌ ఫైనాన్స్‌ను అందించాలని డిమాండ్‌ చేయవచ్చు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాలు చూపుతున్న నిబద్ధత తగినంతగా లేదు సరికదా ఆ ప్రమాణాలను అందుకోవాల్సి ఉంది.
 
ఈ అధ్యయనానికి ఇండియా క్లైమేట్‌ కొలాబరేటివ్‌ అండ్‌ ఎడెల్‌గివ్‌ ఫౌండేషన్‌లు మద్దతునందించాయి. ఈ నివేదిక వెల్లడించే దాని ప్రకారం భారతదేశంలో 640 జిల్లాల్లో 463 జిల్లాలు అసాధారణ వరదలు, కరువు, తుఫానుల ప్రభావం బారిన పడే అవకాశాలున్నాయి. వీటిలో 45%కు పైగా జిల్లాల్లో మౌలిక వసతులు, భూభాగం గణనీయంగా మారింది. అంతేకాదు, 183 జిల్లాలు అసాధారణ ప్రమాదపుటంచుల వద్ద ఉన్నాయి. ఈ జిల్లాల్లో  ఒకటి కన్నా ఎక్కువగా వాతావరణ కారణంగా ప్రమాదాలు సంభవించవచ్చు. సీఈఈడబ్ల్యు అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం 60%కు పైగా జిల్లాలకు మధ్య స్థాయి నుంచి అతి తక్కువ స్వీకరణ సామర్థ్యం ఉంది.
 
అస్సాంలో ధేమాజీ, నగోన్‌, తెలంగాణాలో ఖమ్మం; ఒడిషాలో గజపతి, ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం, మహారాష్ట్రలో సంగ్లి, తమిళనాడులో చెన్నైలు భారతదేశంలో వాతావరణం కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యే జిల్లాలుగా ఉన్నాయి.
 
డాక్టర్‌ అరుణభ ఘోష్‌, సీఈఓ, సీఈఈడబ్ల్యు మాట్లాడుతూ, ‘‘భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో అసాధారణ వాతావరణ పరిస్ధితులు తరచుగా ఎదుర్కోవడం వల్ల అభివృద్ధి కుంటుపడేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయి. సీఓపీ-26 వద్ద అభివృద్ధి చెందిన దేశాలు ఖచ్చితంగా తాము 2009లో వాగ్ధానం చేసిన  100 బిలియన్‌ డాలర్లను అందించడంతో పాటుగా రాబోతున్న దశాబ్దం కోసం క్లైమేట్‌ ఫైనాన్స్‌ అందించాల్సి ఉంది. 
 
అంతేకాదు, ఇండియా ఖచ్చితంగా ఇతర దేశాలతో  భాగస్వామ్యం చేసుకుని గ్లోబల్‌ రీసైలెన్స్‌ రిజర్వ్‌ ఫండ్‌ను సృష్టించాల్సి ఉంది. ఇది వాతావరణ షాక్స్‌కు భీమాగా కూడా సేవలనందించనుంది. ఇది చాలావరకూ క్లైమెట్‌ వల్నర్నబల్‌ దేశాల ఆర్ధిక వ్యవస్థపై భారం తగ్గించనుంది. చివరగా, భారతదేశం కోసం క్లెమెట్‌ రిస్క్‌ అట్లాస్‌  అభివృద్ధి చేయడం ద్వారా అసాధారణ వాతావరణ పరిస్థితుల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను గురించి పాలసీ మేకర్లు  అత్యుత్తమంగా తెలుసుకునే వీలు కలుగుతుంది’’ అని అన్నారు.
 
సీఈఈడబ్ల్యు ప్రోగ్రామ్‌ లీడ్‌ మరియు ఈ అధ్యయనానికి ముఖ్య రచయిత అభినాష్‌ మొహంతీ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో 2005 తరువాత అసాధారణ వాతావరణ కార్యక్రమాలు ఏర్పడటం 200%కు పైగా పెరిగింది. మన పాలసీ మేకర్లు, పరిశ్రమ నాయకులు, ప్రజలు ఖచ్చితంగా జిల్లా స్థాయి విశ్లేషణ చేయడంతో పాటుగా ప్రభావవంతంగా నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమమవుతుంది. ఇండియా ఇప్పుడు ఖచ్చితంగా నూతన క్లైమెట్‌ రిస్క్‌ కమిషన్‌ సృష్టించాలి. చివరగా సీఓపీ-26 వద్ద క్లైమెట్‌ ఫైనాన్స్‌ను ఇండియా డిమాండ్‌ చేయాల్సి ఉంది’’ అని అన్నారు.
 
సీఈఈడబ్ల్యు అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం, భారతదేశపు ఈశాన్యరాష్ట్రాలు అధికంగా వరదల బారిన పడేందుకు అవకాశాలున్నాయి. అదే సమయంలో దక్షిణ మరియు మధ్య భారత రాష్ట్రాలలో కరువు పరిస్థితులు వచ్చేందుకు అవకాశాలున్నాయి. అంతేకాదు తూర్పు భారతదేశంలో 59% మరియు పశ్చిమ భారతంలో 41% జిల్లాలు అసాధారణ తుఫానుల ప్రభావం బారిన పడేందుకు అవకాశాలున్నాయి.
 
ఈ సీఈఈడబ్ల్యు అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం, 63% భారతీయ జిల్లాల్లో మాత్రమే డిస్ట్రిక్ట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌ (డీడీఎంపీ) ఉంది. ఈ ప్రణాళికలను ప్రతి సంవత్సరం అప్‌డేట్‌ చేయాల్సి ఉంది. అయితే 2019 వరకూ చూస్తే కేవలం 32% మాత్రమే ఆధునీకరించారు.