మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 జనవరి 2023 (16:23 IST)

జొమాటో డెలివరీ బాయ్ అతి తెలివి.. సంస్థకు కుచ్చుటోపీ... స్పందించిన సీఈవో

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌లలో జొమాటో ఒకటి. ఇందులో అనేక మంది ఫుడ్ డెలివరీ బాయ్స్ పని చేస్తున్నారు. వీరిలో కొందరు తమ అతి తెలివిని ఉపయోగించి సంస్థకు కుచ్చు టోపీ పెడుతున్నారు. ఈ విషయాన్ని ఓ యువ పారిశ్రామికవేత్త బహిర్గతం చేశాడు. దీంతో జొమాటో సీఈవో కూడా స్పందించారు. సంస్థలో కొన్ని లోపాలు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని సరిచేస్తున్నట్టు చెప్పారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
వినయ్ సతి అనే యువ పారిశ్రామికవేత్త కొన్ని రోజుల క్రితం జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశారు. పిమ్మట 40-50 నిమిషాలకు డెలివరీ బాయ్ ఫుడ్ తీసుకొచ్చాడు. ఆ సమయంలో వినయ్‌తో ఫుడ్ డెలివరీ బాయ్ మాట్లాడుతూ.. సర్.. మీరు ఇకపై ఫుడ్ ఆర్డర్ చేసేటుపుడు ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించకండి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకోండి. అలా చేయడం వల్ల మీరు రూ.800 విలువ చేసే ఫుడ్‌ను సీవోడీ ఆప్షన్ ఎంచుకోండి. 
 
ఫుడ్ తీసుకొచ్చిన తర్వాత మీరు నాకు కేవలం రూ.300 మాత్రం ఇవ్వండి. తద్వారా రూ.800 ఖర్చు చేసే ఫుడ్ కేవలం రూ.300కే పొందవచ్చు అని చెప్పాడు. దీంతో వినయ్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. జొమాటోలో ఇంత పెద్ద మోసం జరుగుతుందా? అని అనుకుని, ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించడంతో అది వైరల్ అయింది. దీనిపై జొమాటో సీఈవో గోయల్ సైతం స్పందించారు. ఈ స్కామ్‌పై స్పందిస్తూ కంపెనీలో కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సరిచేసే ప్రయత్నంలో ఉన్నట్టు చెప్పారు.