1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 మే 2022 (19:45 IST)

ఆదిశంకరాచార్య జయంతి 2022 : కనకధారా స్తోత్రకర్త.. శివుడే కాలడి శంకరుడిగా..?

Adi sankaracharya
Adi sankaracharya
పరమపవిత్రమైన వైశాఖ శుక్ల పంచమీ తిథి జగద్గురు శంకరభగవత్పాదుల వారి జన్మతిథి. ఆదిశంకరాచార్య జయంతిని మే 6 న జరుపుకుంటారు. మహాదేవుడు, శివుడి అవతారంగా కాలడి శంకరుడిగా భూమిపై పుట్టిన ఆదిశంకరాచార్య జయంతి శుక్రవారం వస్తోంది.

అద్వైత వేదాంత జ్ఞానాన్ని, తత్త్వాన్ని అందించడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాల గురించి కూడా బోధించారు. మన తప్పును సరిదిద్దినప్పుడు, దుఃఖం కూడా అంతమవుతుంది... అంటూ అనేక జీవిత సత్యాలను ప్రబోధించారు. 
 
ధర్మోద్ధరణ కొరకై అద్వైత సిద్దాంతాలతో ఎన్నో భాష్యములు, స్తోత్రములు సరళంగా రచించారు. సౌందర్యలహరి, శివానందలహరి, భజగోవింద స్త్రోత్రం లాంటి ఎన్నో గొప్ప స్త్రోత్రములను మనకు అందించారు. దేశం నలుమూలలా ధర్మయాత్రలు చేస్తూ నాలుగు పీఠాలను స్థాపించారు. వారు ఏర్పరచిన గురుపరంపర నేటికీ కొనసాగుతోంది.
 
గురువులను ఈశ్వర స్వరూపంగా భావించి, త్రికరణశుద్ధిగా పూజించి, గురుసేవ, పాదపూజ చేసుకోవడం, శ్రీ శంకరభగవత్పాదుల వారిని పూజించి వారి అష్టోత్తర శతనామావళి, తోటకాష్టకము భక్తిశ్రద్ధలతో పారాయణం చేయడం అత్యంత శుభప్రదం, శ్రేయోదాయకం.
 
శంకరుల బాల్యంలోనే తండ్రి శివగురు మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే వేదవిద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరులు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకొన్న ఉసిరి కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు, ఆశువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు. కనకధారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీ దేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేసింది.
 
గోవిందపాదులు శంకరులను బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు మహావాక్యాలుగా బోధించారు. బోతుండగా శంకరులు తన శక్తితో నదిని నిరోధించారు. గోవిందపాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు ఆజ్ఞతో బ్రహ్మసూత్రా లకు భాష్యాలు వ్రాయడం కోసం పండితులకు నిలయమైన వారణాసి చేరుకున్నారు.
 
గుర్వాజ్ఞతో శంకరులు వారాణసి చేరుకొని పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానమాచరించి, విశ్వేశ్వరుని సన్నిధిలో కొంతకాలం గడిపారు. అయస్కాంతం ఇనుపరజనును ఆకర్షించినట్లు, వేదసూక్ష్మాలు శంకరులకు వారణాసిలో బాగా అవగతమయ్యాయి. వారణాసిలోనే సదానందుడు అనే బ్రహ్మచారి శంకరులకు ప్రథమ శిష్యుడయ్యాడు.