1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 జనవరి 2022 (22:35 IST)

క్వార్టర్స్‌లో ఓటమి... ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు సానియా ఫేర్‌వేల్

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా టెన్నిస్ కెరీర్‌ ముగిసింది. గతంలో రెండుసార్లు ఆస్ట్రేలియన్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న సానియా.. ఇపుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో తన చివరి మ్యాచ్‌‍ను ఆడేసింది. 
 
మంగళవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జా జంట ఓడిపోయింది. క్వార్టర్స్ ఫైనల్స్‌లో సానియా, రాజీవ్ రామ్ జోడీ 4-6, 6-7 స్కోరుతో ఆస్ట్రేలియాకు చెందిన జేమీ పౌరిల్స్ - జేసన్ కుబ్లర్‌ జంట చేతిలో ఓటమిని చవిచూశారు. 
 
నిజానికి ఈ రెండు సెట్లలోనూ సానియా జంట గట్టి పోటీ ఇచ్చింది. కానీ, ఆస్ట్రేలియన్ జంట ఆధిపత్యం దెబ్బకు ఎదురొడ్డి నిలవలేకపోయారు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు సానియా మీర్జా దూరమయ్యారు. 
 
ఈ యేడాది తన చివరి సీజన్ ఆడుతున్నట్టు ఇటీవల సానియా మీర్జా ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నట్టు సానియా ప్రకటించారు. దీంతో సానియా మీర్జా టెన్నిస్ కెరీర్ ముగిసినట్టే. కాగా, ఆమె పాకిస్థాన్ క్రికెట్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే.