పదో తరగతి విద్యార్థినితో ఉపాధ్యాయుడు రహస్య పెళ్లి
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు... తన వద్ద చదువుకునే బాలబాలికలకు ప్రేమ పాఠాలు చెప్పాడు. ఆ తర్వాత ఓ బాలికను లోబరుచుకుని రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో జిరగింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడైన ఉపాధ్యాయుడుని పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పర్రే మైటీన్ (27) అనే వ్యక్తి భౌతికశాస్త్ర టీచరుగా పని చేస్తున్నాడు. అదే పాఠశాలలో చదవుతున్న విద్యార్థినికి మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో వలవేశాడు. ఇటీవల బాలిక మెడలో పసుపుతాడు ఉండటాన్ని గమనించిన తల్లి.. కుమార్తెను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ఉపాధ్యాయుడు తనను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని విద్యార్థిని చెప్పడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ఆ తర్వాత పాఠశాల యాజమాన్యానని నిలదీయగా, వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోచారం పోలీసులు నిందితుడైన టీచరుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.