1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 ఆగస్టు 2021 (11:56 IST)

అదనపు కట్నం తెమ్మన్నారు.. అంతే నిండు గర్భిణీ ఆత్మహత్య

నిండు గర్భిణీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఆమె ఆత్మహత్యకు అత్తింటి వేధింపులే కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఒత్కులపల్లి గ్రామానికి చెందిన జుమ్మిడి లక్ష్మి, రాజమల్లు మొదటి కూతురు దుర్గం రమ్య అలియాస్‌ లత(24)ను భీమారం మండలంలోని నర్సింగాపూర్‌కు చెందిన దుర్గం శేషమ్మ, భూమయ్య దంపతుల పెద్ద కుమారుడు రాజశేఖర్‌కు ఇచ్చి గతేడాది క్రితం వివాహం చేశారు.
 
వివాహ సమయంలో కట్నం కింద రూ. 2 లక్షలు, బంగారంతో పాటు ఒత్కులపల్లిలో కొంత భూమి కూడా ఇచ్చారు. అయితే పెళ్లయిన తర్వాత కొద్ది నెలలకే రమ్యకు వేధింపులు మొదలయ్యాయి. భూమిని అమ్మి డబ్బులు తీసుకురావాలని భర్త, అత్తమామలు రమ్యపై ఒత్తిడి తీసుకువచ్చారు. మరోవైపు ఈ సమయంలోనే గర్భం దాల్చింది. 
 
ఇక, అదనపు కట్నం కావాలని భర్త తరుచూ రమ్యతో గొడవపడేవాడు. తల్లిదండ్రులు పేదవారు కావడంతో అదనపు కట్నం తెచ్చేందుకు ఆమె నిరాకరించింది. ఈ క్రమంలోనే రమ్య గర్భిణి అని కనికరం చూపకుండా శారీరకంగా, మానసికంగా వేధించసాగారు.
 
దీంతో రమ్య తీవ్ర మనస్తాపం చెందింది. ప్రస్తుతం 8 నెలల గర్భిణీగా ఉన్న రమ్య.. గురువారం రాత్రి ఇంట్లో ఉన్న పురుగు మందును తాగింది. విషయం తెలుసుకున్న భర్త, కుటుంబ సభ్యులు భీమారంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. 
 
అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రమ్య మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలి అత్తమామలు శేషమ్మ, భూమయ్య, భర్త రాజశేఖర్‌, మరిది రాకేష్‌లపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్టుగా సమాచారం.